పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/327

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గద్యవాఙ్మయము (తెలుగు)

సంగ్రహ ఆంధ్ర

1. పద్యములను గూర్ప వలనుపడని వంశక్రమాది వృత్తాంతములను చెప్పుటయందు.

2. సుదీర్ఘములగు కథలను సంగ్రహించుటయందు.

3. పాత్రరసోచిత సంభాషణములయందు.

4. శైలీవైవిధ్య సంపాదనమునకై పద్యముల మధ్య భాగములందు.

5. వైదిక, లౌకిక, రాజకీయాది సూక్తులను చెప్పవలసిన సందర్భములందు.

సంస్కృత లాక్షణికులు గద్య విభాగములుగా పేర్కొన్న చూర్ణము, ఉత్కలికాప్రాయము, వృత్తగంధి, ముక్తకమువంటి రచనలు నన్నయ వ్రాసిన వచనములందు కనిపించుచుండును. వృత్తగంధికి ఉదాహరణము :

"ఇట్లు పెక్కు మృగంబుల నెగచి చంపె." ఇది గీతపద్య పాదమువలె నున్నది.

“ఇట్టి మహోత్పాతంబులు పుట్టిన సురపతి" ఇది కంద పద్యభాగమువలె నున్నది.

ఆంధ్ర మహాభారత భాగములను రచించిన తిక్కన సోమయాజి, ఎఱ్ఱాప్రెగడ - ఈ ఇరువురును వచన రచనమున దాదాపు నన్నయ్యగారి యడుగుజాడలనే అనుసరించిరి. తిక్కన సోమయాజి వచనశైలి నన్నయ్య వచన శైలి కంటె స్వల్పముగ భిన్నమైనది. ఇతడు తన పద్యములందు వలెనే వచనమునందును దేశిపదములను అధికముగా నుపయోగించి యుండుటయే ఈ భేదము. నీతిని బోధించు చోట తిక్కనవచనమును ఉపయోగించియున్నాడు. ఎఱ్ఱాప్రెగడ వచనరచనమున నన్నయ్య, తిక్కనల ననుసరించినాడు. కాని ఎఱ్ఱన తాను రచించిన నృసింహపురాణ మున స్తంభోద్భవ వచనమను నొక రచనను చేసినాడు. ఇది ఉత్కలికాప్రాయమనదగును. దీనివలన వచన రచనలో ఎఱ్ఱన నైపుణికలవాడే యనవలసియున్నది.

ప్రబంధములలో వచన రచన : ప్రబంధము లనబడు తెలుగు కావ్యములందు, మహాభారతమునందువలె విరివిగా వచనము ఉపయోగింపబడలేదు. మొత్తము రచనమున దాదాపు ఐదింట నొక భాగము వచనమున కీయ బడినది. సరళ శైలితో రచించిన వచనములు ప్రబంధములందు చాల తక్కువ. ఒక్కొక్కసారి పద్యములకంటె వచనములే కఠినములుగా నుండును. పెద్దన, భట్టుమూర్తి, చేమకూర వెంకటకవి, నంది తిమ్మన మొదలగువారీ పద్ధతినే అవలంబించిరి.

"ఇట్లు సనుదెంచి నిజజనకు నూరుపీఠం బలంకరించుచున్న గౌరి నమ్మునివరులు గని, తదుత్తమ స్త్రీలక్షణ లక్షితంబగు సర్వాంగోపాంగ ప్రత్యేక సముదాయశోభ లుపలక్షించి చూచి ప్రముదిత హృదయులగుచు నిప్పరమేశ్వరి పరమేశ్వరు నగ్రమహిషియగు టేమి యపూర్వంబని నిశ్చయించి, పార్వతి ముద్రారోహణంబుసేసి, నగపతి చేత సత్కృతులై వీడ్కొని చనుదెంచి రంత నంతకుమున్న తద్వృత్తాంతం బెల్ల నెఱింగి హరి, పరమేష్ఠి, పురందర ప్రముఖ సురాసురోరగ సిద్ధ విద్యాధరా ద్యఖిల భువన భవనాధీశ్వరు లీశ్వరాచలంబున కరిగి..." - (కుమార సంభషము. ఆ. 7–141)

"అపవిత్రంబగు పుత్రలాభంబు దత్కళత్రంబునందును సంభవించె నిట్లా నష్టపూర్వ ద్విజన్ముండు కష్టమార్గంబున నెలసి నెలతయుం దానును బ్రాలుమాలి మృణాళనాళ పేశలంబగు ఫణాధర పరివృఢ ఫణాఫలక తలిమతలంబున నంట సిలంబడ నెడనెడం బెక్కు పాతకంబు లుపార్జించుచు, వర్తించి వర్తించి యొక్క నాఁ డొక్కరుండునుం గుర్కుర కుమారయుగళంబు, గుపితశరభ నిభంబగు దాని గళగళాయమాన గళనిగళ నియమితంబుగఁ గేలఁ గేలించి యొంటిపాటున వేటపైఁ గల తివుట నూటాడుచు సమీ పాటవీమధ్యంబు జొచ్చి" - (పాండురంగ మాహాత్మ్యము. ఆ. 3-89.)

"అని బహు ప్రకారమ్ముల హిమగిరి ప్రభావమ్ము వక్కాణించుచుఁ దత్ప్రదేశంబున శిఖా శిఖోల్లిఖిత గ్లావృక్షంబగు నగస్త్య వటవృక్షంబు గనుంగొని యచట నికట విశంకట కటక కమనీయ మణిశృంగంబగు మణిశృంగంబుఁ గని, యగణ్యపుణ్యాగమ సమర్థంబగు హిరణ్య బిందు తీర్థమ్మునఁ గృతావగాహుండై, గో హిరణ్య ధరణ్యాది దానంబు లనేకంబులు గావించి, ప్రాగ్భాగమునఁ గలి కలిత నర శరణ్యంబగు నైమిశారణ్యంబు సొచ్చి..." -(విజయ విలాసము. ఆ. 1-128.)

ఇట్లీ వచనములు అంత్యప్రాసములు, యమకాద్యలం కారములు కలిగి శాబ్దిక చమత్కృతితో కూడియుండును.

ఆంధ్ర సాహిత్యమున శ్రీనాథ కవిసార్వభౌముడు,

282