పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/232

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఖనిజసంపద (ప్రపంచమున, భారతదేశమున)

నన్న (1) తెల్ల సుద్ద (clay) యను పదార్థమందు అల్యూమినియము అను లోహమును, (2) రాతి నార (asbestos) యందు మెగ్నీషియము అను లోహమును కలవు. కాని మొదటిది పింగాణి పాత్రల తయారీయందును, రెండవది ఉష్ణనిరోధకావసరములకును ఉపయోగపడుచున్నవి.

గ్రాఫైటు (graphite), వజ్రము - ఈ రెండును రాసాయనికముగ బొగ్గు పదార్థము మాత్రమే కలిగి యుండును. కాని మొదటిది ఉష్ణరాసాయన నిరోధక పదార్థముగను, రెండవది ఆభరణముగను, కోతపదార్థముగను ఉపయోగపడు చున్నవి.

మానవోపయోగ ఆర్థిక ఖనిజములను గూర్చిన అనేక ఇతర విషయములను తెలిసికొనుటకు పూర్వము వీటికి సంబంధించిన శాస్త్రములను, వీటి అన్వేషణకై జరిగిన కృషినిగూర్చి తెలిసికొనుట అవసరము. రాతియుగ మందలి మానవుడు వేట కొరకును, నిప్పును సృష్టించుటకును ఉపయోగించిన రాతిసాధనములు ఒక రక మైన ఖనిజములే. అందుచే ఖనిజములు రాతియుగము నుండియే మానవోపయోగములుగ నున్నవని చెప్పనగును, కాని అప్పటి మానవుడు, ఈ ఖనిజములు తాదాత్మ్యకముగ కనిపించినపుడు, వాటిని ఆ సమయమున తనకు తోచినరీతిగా ఉపయోగించెడివాడు; లేకున్న పార వై చెడివాడు. కావున ప్రధానావసరములగు పనిముట్లు తయారైన పిదప వాని దృష్టి రంగు రంగులుగా నుండి మెరయు చుండెడి వజ్ర సంబంధిక పదార్థములచే ఆకర్షింపబడెను. ఆనాటి మానవుడు వజ్రములను ఆభరణములుగను, ఆట వస్తువులుగను ఉపయోగించుకొనుటకు కృషి సల్పెను. కావుననే మొట్టమొదటగా వజ్రములు క్రీ. పూ. 3500 సం. పూర్వము నుండియే ఉత్తర ఈజిప్టుదేశమున ఆర్థికముగ ఉన్నతస్థాన మలంకరించినవి. కాని వీనికి సంబంధించిన విషయములను తెలివిగా, తార్కికముగా ఆలోచించి ఎవ్విధముగా వాటిని ఉపయోగించిన సార్థకమగునో కనుగొనుటకు ప్రప్రథమమున యత్నించినది గ్రీకు దేశీయులు. ఖనిజములు ఒక పరిశ్రమగా రూపొందుట క్రీ. పూ. 2500 సం. కే ప్రారంభమైనది. అప్పుడే తెల్ల సుద్ధతో పింగాణీ పాత్రలు, ఇటుకలు, బొమ్మలు చేయుట మొదలైనది. ఈ ఖనిజ విషయముల నొకచో క్రోడీకరించి గ్రంథరూప మొసగిన ("Book of stones") ఘనత గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్ శిష్యుడగు థియోప్రటన్ (క్రీ. పూ. 372-287) నకు దక్కినది. క్రీ. పూ. 1925 సం.న ఈజిప్టు దేశస్థులు ఎఱ్ఱసముద్ర ప్రాంతమున 'మరకతము ' (emerald) అను వజ్రము కొరకు 800 అడుగుల లోతున 400 మంది మనుష్యులు పనిచేయుటకు వీలైన సొరంగమును త్రవ్వినట్లు ఆధారములు కన్పట్టినవి. ఆనాటి భారతదేశమున ఇనుప ఖనిజమును కొలుములలో కరిగించి, దాని నుండి ముడి ఇనుమును తయారుచేసి, పనిముట్లుగా నిర్మించుకొనెడివారు మనదేశమున కన్పడు ఇనుప స్తంభములను పరికించినచో, ఆ రోజులలో భారతీయులు ఎంతటి మేలురకమైన ఇనుమును, ఉక్కును తయారుచేయగలిగిరో స్పష్టమగును.

అనంతరము చాలకాలము వరకు ప్రయత్నపూర్వకముగనో, తాదాత్మ్యకముగనో కనుగొనబడిన ఖనిజములను శక్తికొలది వినియోగించుకొనుట యందును, ఖనిజ సంబంధ విషయ సేకరణము నందును పెక్కు ప్రయత్నములు జరిగినవి. కాని వాటి నొకచో క్రోడీకరించి, విభజించి, వివిధ శాస్త్రములుగ రూపొందించుట జరుగలేదు. ఖనిజము లెట్లేర్పడినవను విషయముపై కృషిసల్పి సవ్యమైన సిద్ధాంతమును ప్రథమముగా ప్రతిపాదించిన వాడు జార్జియస్ అగ్రికోలా (1494-1555). అతని సిద్ధాంతమునకు ప్రస్తుతము విలువలేకున్నను, ఆ శాస్త్రమునకు నాందీ ప్రస్తావన జరపిన ఘనత అతనికే దక్కినది. 18 వ శతాబ్దిలో ఈశాస్త్రమున కొక విశిష్టస్థానమును కల్పించుటకు అనేకులు విస్తారమైన కృషి సల్పిరి. 19, 20 వ శతాబ్దులయందు శాస్త్రజ్ఞుల కొక తార్కిక విమర్శనా దృష్టి ఏర్పడి, అనేక విశిష్ట సిద్ధాంతరచనకు అవకాశ మేర్పడెను. వీటిలో అనేక సిద్ధాంతము లిప్పటికిని చలామణిలో నున్నవి.

వివిధ ఖనిజములను ఉపయోగించు విధానములు జనరంజక మగుటయేగాక, అనేక నూతన విధానములు నిర్విరామముగ కనుగొనబడు చుండుటచే, వాటి గిరాకి దినదిన ప్రవర్థమాన మగుచున్నది. అదియుగాక, ఖనిజములను వెలికి తీసి, తరిగించుటయే మనకు తెలియును

189