పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/170

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

క్యూరీసతి

పరిశోధనశాలలో సౌకర్యము లేదయ్యెను. అందుచే పియరీ పనిచేయు స్కూలులోనున్న ఒక పాత షెడ్డును పరిశోధనశాలక్రింద మార్చి, పిచ్ బ్లెండు రసాయన విశ్లేషణమును ఉభయులు ప్రారంభించిరి. పిచ్ బ్లెండులోని వివిధ ధాతువులను అవక్షిప్తముగావించి (Precipitated) ఆ అవక్షేపములను రేడియో ఏక్టివిటీ కొరకు పరీక్షింపగా, బేరియం సల్ఫేటులోను, బిస్మత్ సల్ఫేటులోను ఈ గుణము కనిపించెను. అనగా పిచ్‌బ్లెండులో రెండు రేడియో ఏక్టివ్‌ ద్రవ్యములు గలవు. మొదటిది బిస్మత్ ను పోలియుండును. దీనికి 'పొలోనియం' (మదాంక్యూరీ స్వదేశమగు పోలెండు చిహ్నముగా) అని పేరు పెట్టిరి. రెండవది బేరియమును పోలియుండును. దీని రేడియో ఏక్టివిటీ చాలా హెచ్చుగా నుండుటవలన, దీనిని రేడియం అనిరి. రేడియం, బేరియం, సల్ఫైటుల మిశ్రమమును, క్లోరైడ్లక్రింద మార్చి అంశ స్ఫటికీకరణ (Fractional Crystallisation) విధానముతో, రేడియం క్లోరైడును వేరుచేసిరి. ఒక టన్ను పిచ్ బ్లెండును విశ్లేషించినచో ఒక గ్రాము రేడియం క్లోరైడు కూడ రాదు. దీనినిబట్టి ఈపని కష్టతరమైనదనియు, దీనికి మిక్కిలి ఓర్పు అవసరమనియు గ్రహింపవచ్చును. మదాం క్యూరీ తన పరిశోధనశాల యందలి పనితోబాటు ఇంటి పనులను,కూతురి సంరక్షణమును నిర్వహింపవలసి వచ్చెను. ఈ విధముగా ఈమె నాలుగేండ్లు నిరంతర కృషిచేసి చివరకు విజయమును సాధించెను.

పరిశుద్ధమైన రేడియం క్లోరైడు, రేడియో ఏక్టివిటీ యురేనియంకన్న మూడు వేల రెట్లు అధికముగా నుండెను. రేడియం క్లోరైడునుంచి రేడియం పరమాణుభారము 225 గా నిర్ణయించిరి. వర్ణమాలలో క్రొత్త మూలద్రవ్యము సూచించు రేఖలు (lines) కనిపించెను. వీటిని బట్టి రేడియం నిస్సందేహముగా బేరియమును పోలు నొక క్రొత్త మూలద్రవ్యమనియు, దాని పరిమాణ సంఖ్య 88 అనియు స్పష్టమ య్యెను.

ఈ సమయములో ఈ దంపతులు రేడియో ఏక్టివిటీ యొక్క ఇతర ధర్మములపై కూడా పరిశోధనలు జరుపుచునే ఉండిరి. ముఖ్యముగా, ఈ కిరణముల ప్రభావము వలన శరీరములోని జీవకణములు ధ్వంసమగునని తెలిసి కొనగలిగిరి. రోగియొక్క కణములను రేడియం కిరణములచే నాశనము చేసినచో వాటిస్థానే ఆరోగ్యవంతమైన కణములు తిరిగి పుట్టగలవు. ఈవిధముగా కాన్సర్ మొదలగు గడ్డురోగములు రేడియం సహాయముతో ఉపశమింప వచ్చునని నిరూపించిరి. ఈ విధానమును నేడు రేడియం థెరపీ (Radium Therapy) అందురు.

ఇన్ని ముఖ్యమైన పరిశోధనలు జరిపియున్నను, వీరు ఇంకను పరిశోధనశాల వసతికొరకు ఇబ్బంది పడుచునే ఉండిరి. ఒకమంచి పరిశోధనశాలతోబాటు పరిశోధనలు జరుపుకొనుటకు తీరికనిచ్చు తగిన ఉద్యోగము పియరీకు సొర్బోన్ విశ్వవిద్యాలయములో లభింపలేదు. అతనికి ఉపాధ్యాయ వృత్తివలన వచ్చు జీతము సరిపోకుండుటచే క్యూరీకూడా పాఠములు చెప్పుట ప్రారంభించెను.

కాని ఇతర దేశములలోని శాస్త్రజ్ఞులు వీరి పరిశోధనల ప్రాముఖ్యమును వెంటనే గుర్తించిరి. 1903 లో బ్రిటిష్ రాయల్ సొసైటివారు వీరిని లండన్‌కు ఆహ్వానించి వీరికి 'డేవి' పతకమును బహూకరించి గౌరవించిరి. అదే సంవత్సరములో రేడియో ఏక్టివిటీ కనిపెట్టి నందులకు బెకేరెల్‌కును, రేడియం కనిపెట్టి నందులకు క్యూరీ దంపతులకును నోబెల్ బహుమానము చెరిసగముగా పంచి ఇయ్యబడినది. యావత్ప్రపంచము వీరి గొప్పతనమును గుర్తించిన తరువాత పియరీ క్యూరీకి సొర్బోన్ విశ్వవిద్యాలయములో ప్రొఫెసర్ పదవి ఇయ్యబడెను. విశ్వవిద్యాలయాధికారులు పరిశోధనాలయము కొరకు రెండు గదులు నిర్మించి, మేరీక్యూరీని పరిశోధనాలయమునందు ముఖ్య సహకారిణినిగా నియమించిరి. ఈ విధముగా వీరు రెండు సంవత్సరములు మాత్రమే కలిసి పనిచేయగలిగిరి.

1904 సంవత్సరం ఏప్రిల్ 19 తేదీన పియరీ క్యూరీ పారీస్‌లో నొక వీధి దాటుచు బండిక్రింద పడి అకస్మాత్తుగా మరణించెను. ఇది మేరీ క్యూరీ జీవితములో గొప్ప విషాద సంఘటనగా పరిణమించెను. కాని ఆమె తన ఇద్దరు కూతుళ్ళను పెంచుట, తన భర్తయు తానును కలిసి మొదలు పెట్టిన పరిశోధనలు పూర్తిచేయుట, తన ముఖ్య కర్తవ్యములుగా భావించి పారిస్‌లోనే ఉండిపోయెను.

పిదప పియరీయొక్క పొఫెసర్ పదవి మేరీకి లభించెను. ఆమె మరల రేడియో ఏక్టివిటీపై పరిశోధనలు

127