పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/161

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కౌటిల్యుడు (అర్థశాస్త్రము)

సంగ్రహ ఆంధ్ర

ముక్త్యాల ప్రక్కగానున్న భరద్వాజాశ్రమమును చూచుదురు. సమీపముననే యున్న ఈ కోళ్ళూరు వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించిగాని వెళ్ళరు. గ్రామమునకు అష్ట దిక్కులయందు ఆంజనేయస్వామి ప్రతిష్ఠలున్నవి.

మశీదులు : నదిప్రక్కన ప్రాచీనమైన మశీదున్నది. ఇది ఔరంగజేబు కాలమునాటి దని చెప్పుదురు అరబ్బీ భాషలో మతసూక్తులు చిత్రింపబడి యున్నవి. ఈ మశీదు ఒక చిత్రమైనది. సుందరమైనది. ఇది ఎత్తైన ప్రదేశమున నున్నందున క్రింద భూమి భాగమున మరొక మశీదు కలదు. ఇది జనానావారు నమాజు చేయుటకు ప్రత్యేకించబడినది. ఈ మశీదు ముందుభాగమున మంచి పనితనము కల్గిన దిమ్మెలుగట్టి, గూనలగుండ కృష్ణా నీరును పైకి ప్రవహింప జేసినారు. నమాజుచేసిన తదనంతరము ఖురాన్ మొదలయిన మతగ్రంథముల పఠనమునకును, మున్షీల ఉపన్యాసములు వినుటకును మశీదుకు ముందర హాలు ఏర్పాటు చేసియున్నారు.

దీపస్తంభము : కోళ్ళూరు సమీపమున ఒక ఎత్తయిన దిమ్మెకలదు. లోపల మణుగు నూనెపోసి వత్తులు వెలిగించుట కవకాశమున్నది. పూర్వమిది నగరమధ్యమున నుండెడిదని, దీపస్తంభము వెలిగించెడువారని చెప్పుదురు. తూర్పున 'మేదరసాని' దుర్గమున్నది. ప్రక్కనే యున్న కేతవరము కొండపై లక్ష్మీనృసింహస్వామి దేవాలయము శాసనములు ఉన్నవి. కోళ్ళూరు మత, సాంస్కృతిక దృష్ట్యానేగాక, రత్నగర్భగా పేరొందినది.

కోహినూరు వజ్రము : వెంకటాయపాలెము వెళ్ళెడు మార్గమున పేరంటాల గుడికి దిగువన పులిచింత - కోళ్లూరులకు మధ్య గోరంటకయ్యన అనగా చిట్యాల, వెంకటాయపాలెము, పులిచింత సరిహద్దుపొడుగున వజ్రాల సేకరణకు లోతైన గుంటలు త్రవ్వినస్థలము లున్నవి.

"కోహినూరు వజ్రము దొరికినది సత్తెనపల్లి తాలూకా కోళ్ళూరులోనే" అని డాక్టరు బాల్ అను భూగర్భ శాస్త్రజ్ఞుడు నిరూపించియున్నాడు. దీనితూకము మొదట 7371/3 కారెట్లు అనీ, తర్వాత 280 కారెట్లకు వచ్చినదని వివరించినారు. ఈ కోహినూరువజ్రము క్రీ. శ. 1565 లో కనిపెట్టిన వజ్రాలగనిలో దొరికినది. తరువాత నీ కోళ్లూరు పేరుపొంది ఒక శతాబ్దకాలము మహా వైభవసంపన్న మై వెలసినది. ఈ పట్టణ వినాశమునుగూర్చి ఒక వింతయైన కథ జనులు చెప్పుచుందురు. ఆ కథ ఏమనగా :

కోళ్ళూరులో ఒక దేవుడు వెలిసెను ఆ దేవుని మహిమచేత - భాగ్యవంతు లగుటకు జనులు ఒక సూక్ష్మమార్గమును కనుగొనిరి. తమ ధాన్యమును మూత్రములో తడిపి ఆ దేవతా విగ్రహముపై పోసినచో ఆ ధాన్యపుగింజలు రవ్వలగుచుండెనట ! జనులందరును ఈ క్రియ నాచరించి భాగ్యవంతులు కాజొచ్చిరి. గ్రామము మిద్దెలు, మేడలతో కళకళలాడుచు వైభవ సంపన్నమై తనరారుచుండెను. అయితే ఆ గ్రామములోని ఒక నిరు పేదబ్రాహ్మణుడు మాత్రము అట్టిపని చేయకుండెను. ఎవరెంత ప్రోత్సహించినను ఆ బ్రాహ్మణుడా తుచ్ఛపుపని చేయ నొల్లకుండెను. ఒకనాడు అద్దమరేయి ఒక వృద్ధబ్రాహ్మణుడా పేద బాపని యింటికి వచ్చి, నిద్రలేపి అతనిని కుటుంబసహితముగా ఊరివెలుపలకి తీసికొనివెళ్ళి అదిగో! కోళ్ళూరు పట్టణ వైభవము చూడు మనెను. ఆ బ్రాహ్మణుడు వెనుతిరిగి చూచునుగదా కోళ్ళూరుపట్టణము ధగద్ధగితముగా మండుచుండెను. ఆ వృద్ధబ్రాహ్మణుడు మాయమయ్యెను. ఈ కథనుబట్టియే “కోళ్ళూరుపట్టణమువలె వెలిగిపోయినది” అను ఒక సామెత పుట్టినది.

ఈ ప్రాంతమున భూగర్భమున ఇనుపగనులు, రంగు రంగుల రాళ్ళు. వజ్రములు, మేలిరకపు సున్నపురాళ్ళు, బెబారైట్లు మొదలగు ఖనిజములెన్నియో నిక్షిప్తములై యున్నట్లు తెలియుచున్నది.

కోళ్ళూరు ముఖ్య యాత్రాస్థలములలో నొకటిగా వన్నె కెక్కినది.

మా. వీ.


కౌ

కౌటిల్యుడు (అర్థశాస్త్రము) :

కౌటిల్యుడు మౌర్య రాజ్యస్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుని కుడిభుజము. అతని రాజనీతి ప్రతిభకంటెను ఆతని పాండిత్యము అధికమైనదని చెప్పుటలో అతిశ

118