పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/148

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

కోడూరు - III

వెల్లాలజాతికిని కలిగిన విరుద్ధ విషయములో మధురాంతక పొత్తపి చోళమహారాజు నిర్ణేతగా నేర్పడెను. బ్రాహ్మణులకు పల్లవరాజు ముక్కంటికాడువెట్టి యనునాతడు ఏబదిరెండు భాగములు సాకలి కోడూరు అను గ్రామమున నొసగినట్లు శాసన మున్నది. ఈ భాగమును ఆ యూరి రైతులు అనుభవించుచు బ్రాహ్మణులకు చెందనీయక యుండగా మనుమసిద్ధి ఈ వాదమును విచారించి, కోడూరు అగ్రహారము బ్రాహ్మణులకు మరలవచ్చునట్లు తీర్మానించినట్లును తెలియుచున్నది. ఈ శాసనములో నుదాహృతములయిన పెనగలూరు, ఇండ్లూరు అనునవి కోడూరు ప్రాంతముననే గలవు. పొత్తపిసీమ కడప సమీపమునుండి కోడూరు దాటి శ్రీకాళహస్తివరకు వ్యాపించినట్లు కనబడును.

సూర్యవంశమువా రగు మట్లరాజుల కాలములో రాజంపేటతాలూకాయందు ఆ రాజులు అరువదినాలుగు అగ్రహారములు కట్టించిరి. పెక్కు చెరువులుత్రవ్వించి ముఖ్యములగు సారవంతములగు భూములను వారు దేవతలకును బ్రాహ్మణులకును ఇనాములుగా నిచ్చినట్లు పూర్వపు శాసనములు సాక్ష్య మిచ్చుచున్నవి. ఈ కోడూరు గ్రామము చారిత్రకప్రసిద్ధి నందినది. ఫలసార వంతమగు కోడూరు పొత్తపి సీమలో మిగుల ముఖ్యమయిన ప్రదేశము. ఇటనుండి శేషాచలారణ్యము ప్రారంభమగును.

కోడూరునకు నిర్వచనము: “కోడు" అనగా పల్లము - నదియొక్క మడుగుతీరము. ఆప్రదేశమున నిర్మించిన గ్రామము కాబట్టి కోడూరు అను నామమేర్పడినది. ఈనదీ నామము కుంజరీ యనునది. పూర్వమిటకు శేషాచలము నుండి యేనుగులు అడవులు తిరిగి యీ నదియందలి మడుగులో నీరుత్రావుచుండుటవలన కుంజరీ యనునామ మానదికి వచ్చినది. ఈ కుంజరీ శబ్దము క్రమముగా జనుల వాడుకలో ఆనోట ఆనోట బడి మారి" గుంజన” యైనది. ఈ నది సర్వకాలముల యందును జలముతో నుండును. ఈ నదీతీరమున అనేక ఫలవృక్ష వనములు, సస్యశ్యామలము లగు కేదారములును గలవు.

జ. వే. సు. శ.


కోడూరు - III :

ఈ కోడూరుగ్రామము కృష్ణాజిల్లా గుడివాడ తాలూకాలో నున్నది. ఈ కోడూరునకు అనపోతపురము అను నామాంతరము కలదు. ఈ అనపోతుడు కొండవీటి రెడ్డి రాజగు అనపోతారెడ్డి ( క్రీ.శ. 1353-1364). ఇదియొక చారిత్రక ప్రదేశము.

టాలెమీ అను పాశ్చాత్య చరిత్రకారుడు తన గ్రంథమునందు ఈ కోడూరును పేర్కొని యున్నాడు. కోడూరును "కొడ్డూర” అని అతడు తన భూగోళశాస్త్ర గ్రంథములో లిఖించియున్నాడు. టాలమీ కాలములో సముద్ర వర్తకమునకు ప్రధానకేంద్ర పట్టణముగా నిది ప్రఖ్యాతి చెంది యుండెను. ఇందుచే, కోడూరునకు తూర్పుగా సముద్రతీరమందున్న మచిలీపట్టణము గొప్ప నావికా రక్షణస్థానముగా నుండెనని స్పష్టమగుచున్నది.

ఈ కోడూరు పురమునకు అనపోతపురమను నామాంతర ముండుటయు, ఇచ్చట అనపోతారెడ్డి దానశాసన మొకటి దొరకుటయు చూడగా, రెడ్డిప్రభువగు అనపోతారెడ్డి రాజ్యవిస్తీర్ణము, ఆతని ఆధిపత్యప్రభావము మన మూహించుట కవకాశము కలదు.

అనపోతారెడ్డి దానశాసనము ఐదురేకులు గల తామ్ర శాసనము, శా, శ. 1280 పుష్యమాసపు టమావాస్యతిధి మంగళవారమునాడు, సూర్యగ్రహణ సమయమున అనపోతారెడ్డి అరువదియొక్కమంది భిన్న భిన్న గోత్రశాఖలు గల బ్రాహ్మణులకు ఈ కోడూరును దానముచేసి, దానికి “అనపోతపురము” అని నామకరణము చేసినట్లు ఈ శాసనము తెలుపుచున్నది. ఈ కోడూరు మలాపహము అను దానియొడ్డున గలదనియు, అష్టవిధైశ్వర్య భోగములతో దానము చేయబడెననియు గూడ ఆ శాసనము సాక్ష్య మిచ్చుచున్నది. మలాపహ తీరస్థ మనుటచే నేటికిని ఈ కోడూరు సరిహద్దులోనే పెద్దమురికికాలువ యొకటి కలదు. కోడు అనగా కాలువ. దాని తీరమందున్న ఊరు కోడూరు. ఈ కోడూరు శాసనరచయిత బాలసరస్వతి అను పండితుడుగా గనుపడుచున్నాడు. ఇది యా పండితునకు గల బిరుదమై యుండును.

ఈ శాసనమువలన అనపోతారెడ్డి విజయములు కృష్ణా, గౌతమీనదుల పర్యంతము విస్తరించినవని మాత్రము విదిత మగుచున్నది. అమరావతిలోనిది అమరేశ్వరాలయము. ఇచ్చటి అమరేశ్వరుని సన్నిధియందు “రావుతు కేశు" డను శత్రువును కృష్ణానది యొడ్డుననే అనపోతారెడ్డి వధించె


105