పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/145

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోడి రామమూర్తి నాయడు

సంగ్రహ ఆంధ్ర

కీకర్‌సింగ్, అర్జున్‌సింగ్'; గులాంమహమ్మద్, కమరుద్దీన్ అహమ్మద్ మొదలయినవారు శ్రీ రామమూర్తి నాయనికి జోహారు లర్పించెడివారు. ఇతడు సర్కసు ప్రదర్శనములు కావించుచు దేశమునెల్ల ముమ్మారు సంచార మొనర్చెను.

రామమూర్తి నాయ డొనర్చిన ముఖ్యమైన ప్రదర్శనాంశములు : (1) ఇనుప గొలుసులను త్రెంచుట. (2) 800 పౌనుల బరువుగల రాతిని తన ఛాతిమీద పెట్టించుకొని సమ్మెటచే దానిపై కొట్టించుకొనుట. (3) రెండెద్దుల బండ్లలో రెండింటియందు నిండుగా మనుష్యులను కూర్చుండబెట్టుకొని ఒక దాని కుడిచక్రమును తన ఛాతిమీదుగను, మరియొకదాని ఎడమచక్రమును తన తొడలమీదుగను ఏకకాలమున లాగించుకొనుట. (4) ఒక్కొక్కదానియందు 36 అశ్వముల శక్తిగల రెండు మోటారుబండ్లను త్రాళ్లతో తన రెండు జబ్బలకును కట్టించుకొని ఆ బండ్లను సాగనిచ్చి, వాటి వేగమును స్తంభింపజేయుటయే గాక వాటి ఎనిమిది చక్రములు పైకి లేచి గిరగిర తిరుగునట్లు చేయుట. (5) లోనికి వాయువును పూరించి, కుంభించి యున్న ఇతని బాహుదండలకు పదిమంది మనుజు లొక లావైనమోకును బిగించికట్టుట, దాని నతడు తన రేచకక్రియచే విడిపోవు నట్లొనర్చుట. ఇతడు రేచించినపుడు ఆతని ఛాతి 48 అంగుళముల పరిమాణమును, కుంచించినపుడు 58 అంగుళముల పరిమాణమును కలిగియుండెడిది. (6) 3 టన్నుల బరువు గల ఏనుగును, కేవల కుంభక క్రియచే తనఛాతిమీద నెక్కించుకొ నెడివాడు. ఇట్టి విలక్షణ ప్రదర్శనముల నింతవర కెవ్వరును చేసియుండలేదు.

భారతదేశములోని సంస్థానాధీశులును, రాజ ప్రతినిధులును, గవర్నరులును ప్రముఖ దేశభక్తులగు అరవింద ఘోషు, లాలా లజపత్‌రాయ, బిపిన్ చంద్రపాల్, సురేంద్రనాథ్ బెనర్జీ, శిశిరకుమారఘోషు, మదనమోహన మాలవ్యా, మోతీలాల్ నెహ్రూ, విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, డాక్టరు భోగరాజు పట్టాభిసీతారామయ్య పంతులు, మహాత్మాగాంధి మున్నగు పలువురు మహాశయులచే ఇతడు పొగడ్తలను గాంచెను. బ్రిటిషుసామ్రాజ్య చక్రవర్తి యగు పంచమ జార్జి శ్రీ రామమూర్తి ప్రదర్శనమున కచ్చెరువంది ఇతని కొక బంగారు పతకము నిచ్చి గౌరవించెను. ఇట్లు బహుమతులుగా లభించిన అనేక పతకములను ఇతడు తన నల్లనికోటుపై ధరించెడివాడు.

రామమూర్తినాయుడు హిందూస్తానీ యందును, ఆంగ్లమునందును, తన మాతృభాష యగు ఆంధ్రము నందును అనర్గళముగను, గంభీరముగను ఉపన్యసించెడి వాడు. స్వరాజ్యసిద్ధి యయినపిమ్మట దేశరక్షణార్థమై వలసిన దేహబలమును సంపాదించుకొనవలెనని యువతీ యువకులకు ఉపన్యాసముల ద్వారమున ప్రబోధించెడి వాడు. ఇతడు ఎల్లప్పుడును అత్యుత్సాహముతోను, నగుమోముతోను ఉండెడివాడు. భారతదేశములోని ప్రతి గ్రామమందును ఒక వ్యాయామశాలను స్థాపించి నియమిత కాలములో యువతీయువకులకు వ్యాయామశిక్షణ మొసగుట ఆవశ్యక మని ఇతడు ప్రచారము చేసెడి వాడు.

ఒకప్పుడు ప్రేక్షకులలో నొకడు " నీ కిష్టమైన ఆహార మెద్ది?" యని ఇతనిని ప్రశ్నింపగా, తనకు కందిపప్పు, నెయ్యి, పెరుగు చాల అభిమానపాత్రములయిన వస్తువులని చెప్పెను. వేదపారగు లగు బ్రాహ్మణులు తనను చూడ వచ్చినపుడు వారిని సత్కరించి వారి ఆశీర్వచనములను వినయవిధేయతలతో స్వీకరించెడివాడు. గ్రంథా లయములపట్ల ఇతనికి అత్యంత శ్రద్ధాసక్తు లుండెడివి. సర్కసు ప్రదర్శనములవలన అనేక లక్షల పరిమితి గల ధనమును ఆర్జించి అనేక ధర్మకార్యములు చేసెడివాడు. బీద విద్యార్థులకు పుస్తకములకొరకు, దుస్తులకొరకు ధన మిచ్చెడివాడు.

1928 వ సంవత్సరమున ఇతడు సర్కసు ఉద్యమము నుండి విరమించుకొని కొలదికాలము విశ్రాంతి గైకొనెను. పిదప కాశీవిశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులైన పండిత శ్రీ మదనమోహన మాలవ్యాగారు ఇతనిని ఆహ్వానించి అచట వ్యాయామ శిక్షణ దర్శకునిగా నియమించిరి. ఇతడు 1938 లో కీర్తి శేషు డయ్యెను. ఇట్టి జగద్విఖ్యాత బలశాలి యగు శ్రీ కోడి రామమూర్తి నాయడు ఆంధ్రులకే గాక భారతీయుల కెల్లరకును చిరసంస్మరణీయుడు.

య. సిం.

102