ఈ పుట ఆమోదించబడ్డది

కోటను, మఠమును, రామదాసుని కిష్టమగున ట్లతని యాలోచన ప్రకారము కట్టుడని యాజ్ఞ యిచ్చెను. 1650 సం. మొదలుకొని పరాలీ మఠము నందును., షాజ్జాన్‌ఘడ్ నందును రామదాసుడు నివసింపజొచ్చెను. వాని పోషణ నిమిత్తము కొన్ని భూములుగూడ నిచ్చెను. రామదాసుని మఠ వ్యవహారముల నన్నిటిని కనుగొనుటకును, దేవతోత్సవముల నన్నింటిని సరిగ జరిపించుటకును శివాజీ కొంతమంది బెద్ద యుద్యోగస్థులను, కొందఱ జిన్న యుద్యోగస్థులను నియమించెను. 1652 సం. రామదాసుడు తన తల్లిని సోదరుని జూచుటకు జాంబ్ గ్రామమునకు వెళ్లెను. అక్కడనుండి యతడు మాళవ దేశమునకు బోయి యుద్ధవు డను నొక శిష్యుని బ్రధాన మఠాధిపతిగా నియమించి 1654 సంవత్సరమున మఱల దన స్థానమునకు బోయెను. ఆతని తల్లి రాణూభాయి 1655 సం. నను, తమ్ముడు శ్రేష్ఠుడు 1657 సంవత్సరమునను గ్రమముగ మరణ మందిరి.

శివాజీ మఠములకు జేసిన దానములి వేఱ్వేఱ బేర్కొన నక్కఱ లేదు. కాని శివాజీ రామదాసుయొక్క బోధనావ్యాపారమును దనపరిపాలనావిషయములో నొక భాగముగ స్వీకరించె నని చెప్పిన జాలును. ఈశ్వరధర్మ స్వరాజ్యముల సమ్మేళనము మహారాష్ట్ర కర్ణాట మాళవ దేశములలో నద్భుత మైన మార్పు కలుగజేసెను. ఈ విధముగ మతబోధనము మహారాజుయొక్క ప్రాపు గాంచిన తోడనే దేశమునందలి ప్రతివ్యక్తియు దన ధర్మము నెడలను రాజ్యము నెడలను నెట్లు నడచుకొనవలెనో తెలిసికొనెను. వ్యవసాయము వృద్ధిచెందెను. పంటలు పుష్కలముగ బండెను. పశుసమూహము బాడియు వృద్ధిపొందెను. సాంఘిక వ్యవహారములు బలమైన పద్ధతులమీద నడచెను. వేయేల పరస్పర సహకారము జనసామాన్యముయొక్క మనస్సుల నుత్సాహ పఱచెను. మొట్టమొదట శివాజీయొక్క సంకల్పములలో నడుగడుగునకు నాటంకము గల్పించిన స్వదేశ జనులే యిప్పుడతనికి దోడుగ వచ్చిరి. రామదాసునియొక్క సహాయ సహకారములు లేకపోయిన పక్షమున శివాజీ ప్రతిష్ఠాకర మైన స్వతంత్ర స్వరాజ్యమును స్థాపింపలేకుండును. రామదాసుయొక్క సహకార మను విద్యుచ్ఛక్తిచేత బ్రదీప్త మైన శివాజీ రాజదండము నాలుగు ప్రక్కలనుండి.