ఈ పుట ఆమోదించబడ్డది

5. వైష్ణవుని యుపన్యాసము

జంఘాలశాస్త్రి ఒకసారి ఒక వైష్ణవభక్తుని ఉపన్యాసాన్ని సాక్షి సంఘసభలో ఏర్పాటు చేశాడు. ఆయన పేరు తిరువేంగడాచార్యులు.

ఆయన భక్తి అంటే ఏమిటో, శాస్త్రోక్తంగా ముందు నిర్వచిస్తూ -తైలధారలాగ, ఎక్కడ తెంపు, వంపు లేకుండా, తరుగు విరుగు లేకుండా వుండే-భగవంతుడిపట్ల–ఏకాగ్ర చిత్తం అని సూచించాడు. భక్తి పేరిట రకరకాల మనుషులు చేసే వింత ప్రవర్తనల్నిబట్ట బయలుచేశాడు. కొందరికి కష్టాలు ఎదురైనప్పడు తాత్కాలికంగా భక్తి ప్రబలుతూ వుంటుంది. కష్టం వెనకబట్టగానే, భక్తి పలాయనం చిత్తగిస్తుంది. ఇటువంటి భక్తికంటె నాస్తి కత్వం మేలు. నాస్తికతలో నీతి వుంది. శాసన విధేయత వుంది.

కొందరు మనుషులు సుఖంగా అంతా జరిగిపోతున్నప్పడు భక్తులు. పూజలు, హారతులు, నైవేద్యాలు, దానాలు, పురాణ పఠనాలు-అబ్బో.! అదంతా గొప్ప ప్రదర్శనమే. వీళ్లకి కాస్త ఒళ్లు వెచ్చబడితే చాలు ఒకటొకట మూల పడతాయి. సొంత సేవలు, బ్రతుకు భయాలు వరించేస్తాయి. ఈ ప్రదర్శనాలకీ, భక్తికీ కూడా ఏమీ సంబంధం లేదు. వీరిది పూజా మందిరం కాదు. బొమ్మల దుకాణం.

ఆచార్యులుగారు భగవద్గీతనుంచి ముఖ్యశ్లోకాలు తీసుకుని -భక్తితత్త్వం ఎంత గహనమైనదో, ఎంత ఆర్తిలోంచి, తపనలోంచి, త్యాగం లోంచి, అర్పణ భావంలోంచి పుడుతుందో వివరించారు. ఇందుకు గజేంద్ర మోక్షం కథనీ, ద్రౌపదీ మానసంరక్షణం కథనీ ఉదాహరించి-ప్రపత్తికి పరాకాష్ఠను సూచించారు. సారాంశంగా-భక్తిమార్గం ప్రకృతి మార్గానికి భిన్న మైంది కాదనీ, భగవంతుని మీద దృష్టి లేకుండా ఒక్క ఆలోచనకూడా చెయ్యవద్దని మనవి చేశాడు.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను.

నాయనలారా! ఒక శ్రీవైష్ణవుడు మనసభలో భక్తినిగూర్చినేఁ డుపన్యసించును. ("ఇదివఱకు భక్తినిగూర్చి యుపన్యసించితిరి కాదా? తిరుగ నావిషయమును గూర్చియే యుపన్యాస మెందుల" కని సభలో గేక.) నాయనా! అట్లన గూడదు. మంచిమాట లెవరు