ఈ పుట ఆమోదించబడ్డది

23. తాజ్‌మహలు

జంఘాలశాస్త్రి, తాజ్‌మహల్ గురించి చుమాలుడు సభలో చెప్పిన దాన్ని వివరిస్తున్నాడు.

తాజ్‌మహల్ని ఒకడు పాలరాతి స్వప్నం అన్నాడు. ఉత్తమమైన లలితకళా సృష్టిని నిశ్శబ్దంగా, నిశ్చలంగా పరిశీలించినప్పడు కేవలం అలౌకిక మైన ఆనందం కలుగుతుంది - తప్పదు.

తాజ్ నాటకానికి కథానాయిక అర్జమంద్ బానూబీగమ్ ముంతాజ్.

సౌందర్యం అనేది సమ్మేళనానికి సంబంధించిన 'సాముదాయిక ఫలం' తాంబూలం రక్తిమలాగ, పువ్వులదండ పరిమళం లాగ, స్వరాల సమ్మేళనం లాగ, మనస్సుల కలయిక లోంచి పుట్టే సామరస్యం లాగ, ‘సౌందర్యం' అనేది కూడా ఎంచదగినది. ఈ కలయిక ఫలం, పటంలో కనబడదు.

అసలీ తాజ్‌మహల్ అవతరించడానికి కారణం - బెంగాల్లో రాజు, రాణి వ్యవహార సందర్భంగా సంచారం చేస్తుండగా ముంతాజ్ కి ఒక చెడ్డ కల వచ్చింది. షాజహాన్ ఓదార్చాడు. కాని, ఆమె ఒక కోరిక కోరింది. నాకు కట్టే గోరీ లాంటిది ప్రపంచంలో ఎక్కడా వుండకూడదు. తీర్థయాత్ర లాగ జనం వచ్చి చూసేలాగ వుండాలని -

ఆమె ప్రసవించి, మరణించిన తరవాత ఏడాదికి, ఏడాదికి, ఈ ‘మహలు' నిర్మాణం కొన్నేళ్లకి పూర్తయి ఆమె శరీరం, ఈ ప్రదేశంలో నిక్షేపించడం జరిగింది.

ఇలా, తాజ్‌మహల్ గురించి చాలా విశేషాలు ఉపన్యాసంలో చెప్పాడు. 1632లో నిర్మించబడిన ఈ మహలు 'పటా'న్ని సృష్టించిన వ్యక్తి "ఉస్తాదు ఈసా అనే పారశీకుడు.

బోయర్ యుద్ద మహావీరుడు లార్డ్ రాబర్ట్స్-“హిందూదేశయాత్ర తాజ్ దర్శనం వల్ల సార్థకమౌతోంద’ని వ్రాశాడట.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను:-

నేను సభలోనికిఁ బోవుసరికి జుమాలుఁ డిట్లు చెప్పచున్నాఁడు.