ఈ పుట ఆమోదించబడ్డది

15. కురుక్షేత్రము

జంఘాలశాస్త్రి ఒకసారి ఢిల్లీ వెళ్లి అక్కడ నుంచి కురుక్షేత్రం యాత్ర చేశాడు.

రైలుదిగి, సూర్యకాంతికి ముచ్చటపడి ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అనుకున్నాడు. ఆశ్చర్యపడే శక్తి మనిషికున్న శక్తుల్లో ముఖ్యమైంది. ఆశక్తి నించే ఎంతటిజ్ఞానమైనా పుట్టింది-అనుకున్నాడు.

జంఘాలశాస్త్రి ఒక బ్రాహ్మణుడింటుకి వెళ్లి స్నానం, భోజనం ముగించుకుని, కురుక్షేత్రంలో యుద్ధభూమిని చూడటానికి వెళ్లాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతా బోధ చేసిన స్థలమేది?-అని అడిగి తెలుసుకొని-అక్కడ నిలబడ్డాడు. ఆ స్థలం కొంచం ఎత్తుగావుంది. అక్కడొక మండపం వుంది. దాని వెనక చిన్నచెరువుంది. భూమ్యాకాశాలు కలిసేవరకు అక్కడ కనుచూపుమేర ఒక్కటే బయలు భయంకరంగా కనిపించింది. రక్కసికంపలు, జిల్లేడు మొక్కలు, వంటవి తప్ప ఇంకే మొక్కలూ లేవు.

ఇదేనా కురుక్షేత్రం! అని-భారత ఘట్టాలు తలుచుకుని-భగవద్గీతను తలుచుకుని—పరవశించాడు జంఘాలశాస్త్రి. అంతలోనే-ఢిల్లీలో తాను చూసిన పాదుషా దివాన్ ఖానా గుర్తొచ్చింది. దాని సౌందర్య ప్రశంస గుర్తొచ్చింది. కాని-జంఘాలశాస్త్రి-మనకు కురుక్షేత్రమే స్వర్గం' అన్నాడు. ధర్మరాజు ద్వైధీభావ మనస్సునీ, అర్జునుడి అజ్ఞానతత్త్వాన్ని తలుచుకుని —కునుకు తీసిన శాస్త్రి ఒకకల వచ్చింది. అందులో వ్యాసమహర్షి కనిపించాడు. భగవద్గీతకు భిన్నభిన్న అర్ధాలలో వ్యాఖ్యానాలు పుట్టాయెందుకని ప్రశ్నించాడు. ఆ వ్యాఖ్యలు సరియైనవి కావు అన్నట్టుగా ఆ మహర్షి చిరునవ్వు నవ్వాడు.-బస్సు మనిషికేకతో జంఘాలుడు మేలుకొన్నాడు.

జంఘాలశాస్త్రి యిట్లు పలికెను.

నేను సభకు బోవుసరికి జంఘాలు డేదియో యుపన్యసించుచున్నాఁడు. అంతకుముం దేమి చెప్పెనో గాని నేను వెళ్లినపిమ్మట నిట్లు చెప్పెను.

కురుక్షేత్రపు స్టేషనులో నేను దిగుటయేమి, సూర్యుడుదయాద్రిపైనెక్కుడ యేమి.