పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/70

ఈ పుట ఆమోదించబడ్డది

 చూడండి;ఎవరితోనైన నాలోచించవలసియున్నయెడల, లచ్చయ్యశాస్త్రి గారికికూడ ఆ జాతకము చూపవచ్చును.

సిద్ధాంతి__చిత్తము. నాకటువంటి సందేహము లేదు.

రాజ__అట్లయిన ఇప్పుడు బసకు పోయి తరువాత దర్శన మిండి.

అని చెప్పి పంపినతరువాత సభవారందఱును తమ యిండ్లకు బోయిరి. రాజశేఖరుఁడుగారు భోజనము చేసి చేయి కడుగుకొను నప్పటికి రాఘవాచార్యు లాబైరాగిని వెంటబెట్టుకునివచ్చి యింటఁ బ్రవేశపెట్టెను. నిత్యమును రాజశేఖరుఁడుగా రాతనికి సకలొపచార ములను చేయుచు భక్తితో ననుసరించుచుండెను. సుబ్బమ్మకు వ్యాధి వెంటనే నిమ్మళించినను స్వర్ణము చేయువిద్యను నేర్చుకోవలెనను నాస క్తితో రాజశేఖరుఁడుగా రాతనిని విడిచిపెట్టక, యింటనే యుంచు కొని నిత్యమును పాలను, పంచదారయు వేళకు సమర్పించుచు నెగళ్లకు వలయు పుల్లలను సమకూర్చుచు బహు విధముల భక్తి సేయుచు నాతని యనుగ్రహ సంపాదనకుఁ దగిన ప్రయత్నములు చేయు చుండెను. ఈ ప్రకారముగాఁ గొన్ని దినములు జరగఁగా నింతలో జనార్ధనస్వామివారికిఁ గళ్యాణోత్సవము సమీపించినది. ఆ యుత్స వమును జూచుటకై చుట్టప్రక్కల గ్రామములనుండి వేలకొలఁది జనులు వచ్చి ప్రతిగృహమునను క్రిక్కిఱిసినట్టు దిగియుండిరి.

మాఘశుద్ధమున నేకాదశినాఁడు రథోత్సవమునకు వలయు ప్రయత్నము లన్నియు జరుగుచుండెను. నాలుగు దినములనుండి రథమునంతను నలంకరించి దాని పొడుగునను వన్నెవన్నెల గుడ్డ లను చిత్ర వర్ణముగల కాగితములను అంటించి, వెదురుకఱ్ఱల కొనలకు హనుమద్విగ్రహమును, గరుడవిగ్రహమును గల ధ్వజపటము లను గట్టి రథమునకుఁ దగిలించిరి. దేవుఁడుకూర్చుండు పైవైపున గెలలతో నున్న కదళికా స్తంభములను నిలిపి వానికి మామిడి మండల తోను వివిధపుష్పములతోను తోరణములను గట్టిరి. ఆ యరఁటి కంబములకు నడుమను తెల్లని లక్కగుఱ్ఱములు రెండు రథము వీడ్చుచున్నట్లు ముంగాళ్ళు మీదికెత్తుకొని మోరలు సారించి