రెండవ ప్రకరణము
రాజశేఖరుఁడు గారి కూఁతురు రుక్మిణి స్నానమునకు వచ్చుట__నదీతీరవర్ణనము__రుక్మిణికిని సిద్ధాంతిగారి భార్యకు జరిగిన సంభాషణ__నీళ్ళకు వచ్చిన యమ్మలక్కల ప్రసంగములు__పంచాంగపు బ్రాహ్మణుఁడు వచ్చి సంకల్పము చెప్పుట__రుక్మిణి స్నానము చేసి బయలుదేరుట.
రాజశేఖరుఁడుగారు పౌరబృందముతో నాలు గడుగులు ముందుకు సాగినతోడనే యొకసుందరి సుందరగమనముతో బాదములయందలి యందియలమ్రోత మట్టియల మ్రోతతోఁ జెలిమిసేయ, మొలనున్న వెండి యొడ్డాణము యొక్కయు, ముంజేతుల పసిడికంకణముల యొక్కయు. గాజుల యొక్కయు కాంతులు ప్రతి ఫలించి కుడిచేతిలోని తళతళ లాడుచున్న రాగిచెంబునకుఁ జిత్రవర్ణ మొసంగ, మోమున లజ్జాభయములు నటియింప, పయ్యెద చక్కఁజేర్చుకొనుచు తిన్నగాఁ దలవంచుకొని మెట్లు దిగి వచ్చి చెంబును నీటి యొడ్డున నుంచి చెంబు మూతి కంటించియున్న పసుపుముద్దను దీసి కొంత రాచుకొని మోదుగాకులోఁ జుట్టి తెచ్చుకొన్నకుంకుమ పొట్లము నొక బట్టయుతుకుఁ రాతిపయిఁబెట్టి, మోకాలిబంటి నీటిలో నిలుచుండెను. ఆమె రాజశేఖరుడుగారి పెద్దకూతురగు, రుక్మిణి. ఆహా! ఆమె సౌందర్యమును బ్రత్యక్షమునఁ జూడ నోచిన వారి కన్నులే కన్నులు. ఆకాలమున హిందూదేశమునందలి సుందరులతో నెల్లఁ దెనుఁగు దేశములోని వారే రూప రేఖా విలాసములచేత నసమానలుగా నుండిరి; వారిలోను బ్రాహ్మణజాతి నాతులు మిక్కిలి చక్కనివారు. కాని రుక్మిణి రూపమును దలఁచి నప్పుడు మాత్రము, ఆ సుందరు లొకసౌందర్యవతు లని చెప్పుట కెల్లవారును సంకోచ
24