వచ్చెను. ఈ క్రొత్త పంతులవద్ద మునుపటివలె నా యాటలేమియు సాగినవికావు. ఇంతలో మా తండ్రియు నాకస్మికముగా గుండెలలో నొప్పి వచ్చి లోకాంతరగతుఁడయెను. ఆతఁడు తన ధనము నెక్కడనో పాతిపెట్టి మరణకాలమునందెవ్వరితోను చెప్పకయే కాలము చేసినందున పెద్దమ్మవారు మమ్ము మఱింత శీఘ్రముగా వచ్చి యాశ్రయించెను. ధనికుఁడైన మా పొరుగువారి పిల్లవాఁ డొకఁడు మా బడి లోనే చదువుకొనుచుండెను:ఆతఁడు చదువునందు మిక్కిలి యాసక్తి కలవాఁడు. ఆతనితో నేను మైత్రి చేసికొని మిక్కిలి నమ్మకమిచ్చి మెలఁగుచుంటిని. కొందఱు నమ్మకమిచ్చినప్పుడు మనసుకూడ నిచ్చి యూరకుందురు; నేను తెలివిగలవాఁడను గనుక అలాగున జేయక వేయి నమ్మకము లిచ్చినను మనసు మాత్ర మియ్యక దాఁచుకొంటిని ఈ ప్రకారముగా నుండి యతనిని పలువిధముల మోసముచేసి ధన మార్జించుచుంటిని. అది యేమి మాయయోకాని నేనెన్నివిధముల మోసముచేసి ధనము సంపాదించుకొనుచున్నను బీదవాఁడుగాను, అతఁడు ధనవంతుడుగాను ఉంటిమి. ఆతఁడు విద్యయందు వృద్ధి పొందిన కొలఁది, నేను ద్యూతవిద్యయందు పాండిత్యమును పొంద నారంభించితిని. చెడుపిల్లవాండ్రతోడి సాంగత్యమువలనఁ జదువు మానివేసి డబ్బుపెట్టి జూదమాడ మొదలుపెట్టి యా వ్యసనములోఁ బడి యింటఁగల వస్తువులను దొంగతనముగాను బలవంతముగాను దీసికొనిపోయి జూదగాండ్రకు సమర్పించుచుందును. ఇట్లుండియు మా పొరుగు చిన్నవానితోడి చెలిమిని మాత్రము మానలేదు. అతని పేరు భాస్కరుఁడు, నా పేరు పద్మనాభుఁడు. ఇట్లు జరుగుచుండఁగా నాకు పదియాఱు సంవత్సరములు దాఁటినవి; నా మిత్రుండు పెద్ద వాఁడై గృహయాజమాన్యమును వహించి విద్యాభిరుచిగలవాఁడై సదా పండితుల గోష్టిని ప్రొద్దుపుచ్చుచుండెను. నేనొకనాఁ డతని యొద్దకుఁ బోయి నా స్థితిగతులను జెప్పుకొని నా తండ్రియు వర్తకుఁడే గనుక నాకు వ్యాపారము చేయ నిష్టముకలదనియు మూలధనము క్రింద నేమైనఁబెట్టుబడిబెట్టి సాయముచేయవలసినదనియు కోరితిని.
పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/201
ఈ పుట ఆమోదించబడ్డది