ఈ పుట ఆమోదించబడ్డది

66

ప్రసార ప్రముఖులు.

డా. ఆర్. అనంతపద్మనాభరావు

రేవూరు అనంత పద్మనాభరావు 1947 జనవరి 29న నెల్లూరు జిల్లా చెన్నూరులో జన్మించారు. నెల్లూరు వి. ఆర్. కళాశాల నుండి బి. ఏ. పట్టభద్రులైనారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఎం. ఏ. లో సర్వ ప్రథములుగా స్వర్ణ పతకాన్ని 1967లో పొందారు. 1967 నుండి 75 వరకు కందుకూరు ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పని చేశారు. ఆ కాలంలో 50కి పైగా అష్టావధానాలు చేశారు. కవిగా, రచయితగా పద్మనాభరావు 35 గ్రంథాలు ప్రచురించారు. కందుకూరి రుద్రకవిపై పరిశోధన చేసి పి. హెచ్.డి. పట్టా పొందారు.

1975 ఆగష్టు 16న ఆకాశవాణి కడప కేంద్రంలొ తెలుగు ప్రసారాల ప్రొడ్యూసర్ గా చేరి 75-82 మధ్యకాలంలో కడప, విజయవాడలలో పని చేశారు. 1982 అక్టోబరు నుండి ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా (UPSC సెలక్షన్) 85 జనవరి వరకు పని చేశారు. 85-87 మధ్య కాలంలో వాణిజ్య ప్రసార విభాగం అధిపతిగా చేశారు. 1987 ఏప్రిల్ నుండి 88 వరకు ఢిల్లీ లోని Staff Training Instititue లో పని చేశారు. 1988 లో UPSC ద్వారా డైరక్టర్ గా సెలక్టయి డైరక్టరేట్ జనరల్ కార్యాలయంలో ప్రసంగాల శాఖ డైరక్టర్ గా (Director of Programmes, Spoken word) గా పనిచేశారు. 88-90 మధ్య ఢిల్లీ స్టాఫ్ ట్రైయినింగ్ ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డైరక్టర్ గా రెండేళ్ళు పనిచేశారు. 1990 ఆగష్టు నుండి అనంతపురం ఆకాశవాణి తొలి డైరక్టరుగా మూడేళ్లు పనిచేశారు. సెలక్షన్ గ్రేడ్ డైరక్టరుగా 93-95 మధ్యకాలంలో కడప కేంద్ర డైరక్టర్ గా పనిచేశారు. 1995 మార్చి నుండి విజయవాడ కేంద్ర డైరక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రారంభ సమయంలో 1989 మార్చిలో ఆయన తొలి డైరక్టరు.

కవి, నవలా రచయిత, వ్యాసకర్తగా పద్మనాభరావు ప్రసిద్ధులు. వి. వి. గిరి, ప్రకాశం రాయలసీమ రత్నాలు వంటి జీవిత చరిత్రలు రచించారు. రుద్రకవి, ప్రకృతికాంత, భక్తి సాహిత్యం విమర్శనా గ్రంథాలు. హరివంశం ధారావాహికంగా రేడియోలో ప్రసారమై ప్రచురితమైంది.

కేంద్ర సాహిత్య అకాడమీ వారికి "ప్రభాతవదనం" తెలుగులోకి అనువదించారు. ముల్క్‌రాజ్ ఆనంద్ "Morning Face" కు అది తెలుగు అనువాదం.