ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

65

P. R. రెడ్డి :

పెనుమల్లి రామిరెడ్డి 1934 జూలై 5న కృష్ణాజిల్లాలో మోరంపూడిలో జన్మించారు. శాంతినికేతన్‌లో ఎం. ఏ. పూర్తి చేశారు. 1957 లో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ పదోన్నతి పొందారు. 1978లో A. S. D. గా బొంబాయి వెళ్ళారు. 1981 లో స్టేషన్ డైరక్టర్‌గా పదోన్నతి పొంది బొంబాయి వివిధభారతి కార్యకలాపాలు చూశారు. అక్కడనుండి విజయవాడ కేంద్రంలో 83 మార్చి - 86 ఫిబ్రవరి మధ్య కాలంలో పనిచేశారు. విజయవాడ నుండి కడప బదిలీ అయి రెండేళ్ళు పనిచేశారు. విదేశీ ప్రసార విభాగం డిల్లీలో డిప్యూటీ డైరక్టర్‌గా పనిచేశారు. అక్కడనుండి సెలక్షన్ గ్రేడ్ పొంది 1989లో వరంగల్ కేంద్రం డైరక్టర్‌గా వెళ్ళారు. రెడ్డి 90 లో హృద్రోగంతో వరంగల్‌లో హఠాన్మరణం చెందారు.

ముక్కుకుసూటిగా వెళ్ళే అధికారిగా రెడ్డి పేరు పొందారు.

కలకత్తా, రాజ్‌కోట్, గౌహతి కేంద్రాలలో పనిచేశారు.

వీరు ఆకాశవాణిలో చేరడానికి ముందు డిల్లీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో సబ్ - ఎడిటర్‌గా పని చేశారు.

వీరి కుమారులు శంకర్‌రెడ్డి విజయవాడ కేంద్రంలో పనిచేస్తున్నారు.

P. శ్రీనివాసన్ :

శ్రీనివాసన్ 1924 నవంబరులో జన్మించారు. మదరాసులో 1950 దశకంలో వీరు ఆకాశవాణిలో చేరారు.

శ్రీనివాసన్, సుభద్రా శ్రీనివాసన్ దంపతులు ఆకాశవాణిలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌లుగా సుప్రసిద్ధులు. కొహిమావంటి క్లిష్టమైన కేంద్రాలలో వీరు పనిచేశారు. విజయవాడ కేంద్రం డైరక్టర్ గా రెండేళ్ళు పనిచేశారు. వీరి కాలంలో వివిధ కార్యక్రమాలు శ్రోతలను ఆకట్టుకొన్నాయి. కొంతకాలం హైదరాబాదులోని ప్రాంతీయ శిక్షణా కేంద్రం అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశారు. 1982 నవంబరులో పదవీ విరమణానంతరం విశాఖపట్టణంలో స్థిరపడ్డారు.