ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

63

దండమూడి రామమోహనరావు :

సుప్రసిద్ధ మార్దంగికులలో దండమూడి విశిష్ట వ్యక్తి రామస్వామి చౌదరి కుమారులుగా రామమోహనరావు 1933 మార్చి 18న విజయవాడలొ జన్మించారు. పళని సుబ్రహ్మణ్యం పిళ్లె, కొండపాటూరి రంగనాయకుల వంటి గురువుల వద్ద మృదంగ విద్యను అభ్యసించారు. తన ఆరవ ఏట శ్రీ యస్ దొరై సంగీత కచేరీకి మృదంగం వాయించి పండితుల ప్రశంసలు అందుకొన్నారు.

కర్ణాటక సంగీతంలోని ప్రసిద్ధులు పారుపల్లి రామకృష్ణయ్య, ద్వారం వెంకట స్వామినాయుడు, దాలిపర్తి పిచ్చిహరి, వోలేటి, ఈమని, చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్లె, బాలచందర్, చెంబై వంటి ఆ తరం వారికి మృదంగ సహకారం అందించారు. నేటి సంగీత కళాకారులలో ఆయన సహకరించని ప్రసిద్ధులు లేరనడం ఆశ్చర్యం కాదు. రామమోహనరావు ఆకాశవాణిలో టాప్ గ్రేడ్ ఆర్టిస్టుగా ఎంపికయ్యారు. 1944 నుండి ఆకాశవాణి కళాకారుడుగా పేరుపొందారు. 1949 లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలొ మృదంగ విద్వాంసులుగా చేరి 1993 లో పదవీ విరమణ చేశారు. కేంద్ర సంగీత నాటక అకాడమి 1995 లో వీరిని సత్కరించింది. వాద్యరత్న నాద భగీరథ, కళా ప్రవీణ వంటి బిరుదులతో పాటు కనకాభిషిక్తులయ్యారు. ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ, ఇటలీ, నార్వే, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఇతర యూరప్ దేశాలు విస్తృతంగా పర్యటించి కచేరీలు చేశారు. పాంప్ విశ్వవిద్యాలయంలో పాఠాలు బోధించారు. ఎందరో సంగీత విద్వాంసుల్ని తయారుచేశారు. వీరి సతీమణి శ్రీమతి సుమతి విజయవాడ సంగీత ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి :

రామకృష్ణశాస్త్రి గుంటూరులో 1932 జనవరి 6వ జన్మించారు. తండ్రి సీతారామశాస్త్రి గారి వద్ద సంగీత విద్యాభ్యాసం గావించారు. 1947 నుండి సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. 1956 నుండి ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో సంగీతవాద్యాల పరిరక్షకులుగా (Care taker, Musical Instruments) 1962 వ సంవత్సరంలో చేరారు. భక్తిరంజని, సంగీత శిక్షణ, సంగీత రూపకాలు, కచేరిల ద్వారా శ్రోతల మన్ననలు పొందారు. 1980 లో తంబురా కళాకారులుగా నియుక్తులయ్యారు. 1992లో పదవీ విరమణ చేసేంతవరకు రామకృష్ణశాస్త్రి తమ గాత్రమాధుర్యంతో శ్రోతల నలరించారు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీవారు శాస్త్రి ప్రతిభను గుర్తించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సంగీత విభాగానికి Visiting Professor గా కొంతకాలం వ్యవహరించారు. తెలుగు విశ్వవిద్యాలయం వారు వీరి సేవలను పరిక్షాధికారిగా వినియోగించుకొంటున్నారు. శాస్త్రి విజయవాడలో స్థిరపడ్డారు.