ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

59

ప్రయాగ నరసింహశాస్త్రి :

తన ప్రత్యేక కంఠస్వరంతో ఖంగుమని పలుకుతూ, జానపద శైలిలో పాడుతూ శ్రోతల్ని వుర్రూత లూగించిన వ్యక్తి శ్రీ ప్రయాగ నరసింహశాస్త్రి. మూడు దశాబ్దాలు ఆకాశవాణిలో పనిచేసి ' సెబాస్ ' అనిపించుకొన్న వ్యక్తి. 1936 లో ప్రయాగ ఆకాశవాణి మదరాసు కేంద్రంలో నిలయ విద్వాంసుడుగా చేరారు. ' బావగారి కబుర్ల ద్వారా వీరు శ్రోతలకి చేరువయ్యారు. విరు, గాడేపల్లి సూర్యనారాయణ గారు కలిసి బావగారి కబుర్లు నిర్వహించేవారు. అవి శ్రోతల జీవనంలో భాగమైపోయాయి. ' ఏమండోయ్ బావగారు ! రావాలి ! రావాలి ! ' అనే పలకరింపులు సహజమయ్యాయి. స్క్రిప్టు లేకుండా యధాలాపంగా అనర్గళంగా తన సంభాషణలతో వినోదాన్ని అందించేవారు ప్రయాగ.

నరసింహశాస్త్రి 1909 నవంబరు 20 న విశాఖ జిల్లా పెదగాడి గ్రామంలో సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. బాల్యం నుండి సంగీత సాహిత్యాలపై అపారమైన ప్రీతి. విజయనగరం మహారాజా కళాశాలలో చదువుకొని పట్టభద్రులయ్యారు. శ్రీశ్రీ, ఇంద్రగంటి హనుమఛ్చాస్త్రి వీరి సహాధ్యాయులు. ఆదిభట్ల నారాయణ దాసు గారి వద్ద హరికథా గానంలో మెళుకువలు నేర్చుకొన్నారు. చక్కని గాత్రము రూపము ఉన్న ప్రయాగ 1935లో చలన చిత్రరంగ ప్రవేశం చేశారు. భీష్మ చిత్రంలో విచిత్రవీర్యుని పాత్రను పోషించారు. నాగయ్య గారి త్యాగయ్య చిత్రంలో గణపతి పాత్రను పోషించారు. అనేక చిత్రాలకు పాటలు వ్రాశారు. 1969లో ఆకాశవాణిలో పదవీ విరమణ చేసిన తర్వాత మళ్లీ చిత్రరంగంలో ప్రవేశించారు. చీకటి వెలుగులు, అందాల రాముడు, డబ్బుకు లోకం దాసోహం వంటి సినిమాలలో నటించారు.

ఆకాశవాణి మదరాసు కేంద్రంలొ 1936 నుండి రెండు దశాబ్దాలు పనిచేశారు. అక్కడ వీరు ప్రసారం చేసిన మొద్దబ్బాయ్ HMV గ్రామఫోన్ రికార్డు కంపెని వారు రికార్డు చేసి విడుదల చేశారు. 20కి పైగా HMV రికార్డులు ప్రయాగ రిలీజ్ చేశారు. శ్రోతలలో వీరికంత ప్రశస్తి వుండేది. 1956లో ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి బదలీ అయి వచ్చారు. అక్కడ సర్వశ్రీ పింగళి లక్ష్మీకాంతం, బందా కనకలింగేశ్వరరావు, బాలాంత్రపు రజనీకాంతారావు, జరుక్ శాస్త్రి, బాలమురళి, ఓలేటి వంటి పండితుల సాహచర్యం లభించింది.