కొంటిని. ఆ లేఖ తీసికొని త్రోవలో నాలుగు కమలాఫలములను కొని ప్రొద్దుటనే తిరువలి క్కేణి వెంకటరంగం పిళ్ళె వీధి లోని నాల్గవ నెంబరు ఇంటి కేగితిని. తలుపు తట్టి లోని కేగుదునుగదా ఆశ్చర్యము పై నాశ్చర్యము!
శ్రీ శాస్త్రిగారి రచనలను చదివినపుడు వారి యాకార, వేష, భాషాచారములను గూర్చి నాకు తెలియక యే మనసులో నొక రూప మేర్పడెను. వారు సన్నముగాక లావుగాక బంగారువన్నెగల స్ఫురద్రూపి యగు ఆ చారపరాయణుఁ డని నా భావన! లావుగా, చామనచాయ మెఱుపు మేనితో నున్న వారిని పోల్చుకోలేక పోతిని. "ఏం! నాయనా! ఎవరు నీవు!" అని వారు స్నిగ్ధగంభీరమగు స్వరముతో నన్ను పలుకరించిరి.
నా యూహలో ఆ కంఠధ్వని యట్లుండు ననుకొనలేదు.నేను తేరుకొని వారికి నమస్కరించి " మాది గుంటూరు..." అని చెప్పునంతలో శ్రీలక్ష్మి నారాయణగారు లోనుండి వచ్చి నన్ను పరిచయము గావించిరి. వారి నచట కలియుదు నని నే నెఱుఁగను. ఏదో పనియుండి చెన్న నగరము వచ్చి ఆ క్రిందటి రాత్రియే వారిటకుఁ జేరిరట!
శ్రీ శాస్త్రిగారు నేను వారింటికి చేరుసరికి దంతధావన చేయుచుండిరి. అప్పటి కేడు గంటలు దాటియుండును. ఆసరికి వారు స్నానజపాదులను ముగించి యుందురని తలచిన నా కిది క్రొత్తగా నుండెను. వారితో పరిచయము పెరిగిన పిమ్మట తెలిసికొంటిని. సాయంకాలమందు యోగ చికిత్సకై వారికడ కేతెంచు నార్తులతో వారికి పెందలకడ తెమలదు. అందఱు