ఈ పుట ఆమోదించబడ్డది

260

ఒక యోగి ఆత్మకథ

కలిగే ముక్తిప్రదమైన అఘాతానికి తట్టుకొనేటట్టుగా మనిషిని తయారు చెయ్యగలదు.

చిత్తశుద్ధిగల భక్తుడికి దివ్యానుభూతి సహజంగానే తప్పనిసరిగా వస్తుంది. అతని గాఢమైన ప్రార్థన, ఆపడానికి వీలులేనంత శక్తితో దేవుణ్ణి ఆకర్షించడం మొదలుపెడుతుంది. ఆ ఆకర్షణ తీవ్రతవల్ల ఈశ్వరుడు అన్వేషకుడి చైతన్యపరిధిలోకి విశ్వదర్శనంగా ఆకృష్టుడవుతాడు.

తరవాత కొంత కాలానికి, “సమాధి” అన్న పేరుతో నేను ఈ కింది పద్యం రాశాను; దాని శోభను ఇలా అభివర్ణించడానికి ప్రయత్నించాను;

మటుమాయమయినాయి వెలుగు నీడల తెరలు,
హరించిపోయింది ప్రతి దుఃఖబాష్పం,
గతించి పోయాయి క్షణికానంద ఉషోదయాలు,
తొలగిపోయింది ఇంద్రియాల క్షీణ మరీచిక.
రాగద్వేషాలూ సుఖాసుఖాలూ జీవన్మరణాలూ అనే మిథ్యాఛాయలు
నశించిపోయాయి ద్వైతమనే వెండితెరమీద.
నిలిచిపోయింది మాయాఝంఝ
గాఢ సహజావరోధ మంత్రదండ చాలనంతో,
లేవు నాకిక వర్తమాన భూతభవిష్యత్తులు,
అయినా నిత్యుణ్ణయి, సర్వవ్యాపకుణ్ణయి, నేనే, నేనే, ప్రతిచోటా
గ్రహాలు, నక్షత్రాలు, నీహారికాపుంజం, భూమి,
ప్రళయకాల ఉత్పాతాల అగ్నిపర్వత ఉజ్జృంభాలు
సృష్టికి ఉపకరించే మండుతున్న కొలుములు.