ఈ పుట ఆమోదించబడ్డది

74

నారాయణరావు

లక్ష్మీ: అసలు వీడి సిద్ధాంతం చెప్పవోయి.

పరం: ఈరోజుల్లో పాశ్చాత్యవిద్య చదువుకున్న ఆడవాళ్ళ అంతరాంతరాల్లో భారతీయ సంప్రదాయ వాసన ఉండనే ఉంటుందట.

లక్ష్మీ: అదా! అదెప్పుడూ మావాడి వాదనలో ఒహటి.

పరం: ఒరే! నువ్వు గాంధిగారి భావాలన్నీ అద్భుతం, నిజం అంటావు. ఆయన ఏవన్నారూ, ‘పాశ్చాత్యవిద్య లేకపోతే రామమోహనరాయ లింకా చాల గొప్పవాడయి ఉండును’ అని. దానిమీదేగా మోడరన్ రివ్యూ మొదలైన వాటికి కోపాలొచ్చాయి. అల్లాఅంటే అర్థం ఏమిటిరా లక్ష్మీపతీ? పాశ్చాత్య విద్యవల్ల నిజమైన భారతీయ నాగరికత నశించిపోతుందనేనా?

లక్ష్మీ: అవును. నిజమే!

నారా: ‘పాశ్చాత్యవిద్య వచ్చినా’, అని నేను అననే అన్నాను. అంటే మన వనితాలోకం విషయంలో గాంధిమహాత్ముని సిద్ధాంతం పూర్తిగా అన్వయించుననే నా అభిప్రాయం. అంతే గాని అది తప్పుఅని కాదుగదా. అంటే మన దేశంలో కాస్త తెలిసో తెలియకో సంప్రదాయం బ్రతికించి వున్నది ఆడవాళ్ళే అని.

పరం: ఏమిటి బ్రతికించిఉన్నది? పక్కపాపిళ్ళు, సిసిమా ముస్తాబులు, విడాకులరంధీ_వీటినేనా?

నారా: అన్నీ ఒప్పుకున్నా. కాని యీ పై పై మోజులతో పాశ్చాత్య తత్వం పూర్తి అయిందంటావా?

పరం: ఇంత వరకూ వచ్చిన తరువాత పూర్తికాక మానుతుందా? వాళ్ళ చదువు పూర్తిగా ఎక్కినకొద్దీ తక్కిన ముచ్చట్లు కూడా తీరవూ? తొందర పడతావేం?

నారా: కావచ్చును. కాని నేను ప్రస్తుత స్థితిని గురించే చెప్పుతున్నా.

లక్ష్మీ: సరే ఇద్దరి వాదనా ఒక్కటే. ఇక పదండి.

౧౭

మనుగుడుపులు

జమీందారు గారు వ్రాసిన యుత్తరమువల్లను, తీసికొని వెళ్ళుటకు వచ్చిన జమీందారు గారి చుట్టము గంగరాజు రంగారావు దేశముఖు గారి పట్టువల్లను, నారాయణరావుతో మనుగుడుపులకు నాతని యప్పచెల్లెండ్రు నలువురు, వదిన గారు, సూర్యకాంతము అత్తగారును తరలి వెళ్ళినారు.

సుబ్బారాయుడుగారు వధువువెంట వచ్చిన ఆడపెళ్ళివారి కందఱుకు, రంగారావు దేశముఖు గారికి వెలపొడుగు వస్త్రములు వెండిపళ్ళెములు ఫలములు