ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమ భాగము

౧ ( 1 )

“నీకు పెండ్లి అయినదా?”

“ఏదియో పడిపోయినట్లు అలపెరుంగని మహావేగమున ఈ లోక మంతయు ఎచటి కిట్లు పరువెత్తిపోవుచున్నది! కనులు మూసికొన్న చో వెనుక కేగుచున్నట్లు తోచు నీ లోకము, నిజముగా ముందుకే పోవుచున్నదా? ఈ ధూమశకట మతిరయమున బరువిడుచుండ, ఆ వృక్షములు, పొదలు వెనుక కేగుట యేమి! ఆ తారకలతోడి, మబ్బులతోడి మహాగగనము కదలకుండుటయేమి! ఇది యంతయు భ్రమయనుకొని నవ్వుదమా, నిజమనుకొని అచ్చెరువందుదమా!”

“అనేక కోటి యోజనముల దవ్వున దీపకళికలవలె మినుకుమినుకుమను నా నక్షత్రములు, ఈ గ్రహగోళములు, ఈ మట్టిముద్దపై ప్రాకులాడు మనుజ కీటకములకొఱకే దివ్వటీలు పట్టుచున్నవా! కోటి సూర్యోజ్జ్వలములగు తారకలు, వాని నాశ్రయించిన గ్రహములు నివియెల్ల ఎవరి నిట్లు వెదకికొనుచు పోవుచున్నవి? ఛందస్సులను దర్శించిన మన మహర్షులు ఈ పరమార్థమును ఎంత చక్కగా గానము చేసిరి!

“ఈ తారకలుకూడ సంగీతము పాడునట. అవి ఏ మహాభావమును గానము చేయుచున్నవో! బెథోవిన్, త్యాగరాజు మొదలైన గాయకులు ఆ మహాభావము నేనా తను గాంధర్వమున ప్రతిఫలింపజేయుచున్నది?”

వ్యక్తావ్యక్తమగు తన యాలోచనముల నుండి మరలి నారాయణరావు రైలు కిటికీ నుండి తల వెనుకకు దీసి, ఆ యింటరుతరగతిలో మైమరచి నిద్రించుచున్న స్నేహితుల పారజూచినాడు. మెయిలు అమిత వేగముతో కృష్ణానది వంతెన దాటి బెజవాడ స్టేషను సమీపించినది.

‘ఒరే సుషుప్తి కుమాళ్లు! లెండి! బెజవాడ వచ్చాము. ఒకటే నిద్దరా! లెండర్రా!’ అని నారాయణరావు తన స్నేహితుల నిద్దురలేపినాడు. కన్నులు నులుముకొని, చిరునవ్వునవ్వుచు పరమేశ్వరమూర్తి లేచి, ఇటు నటు పరికించి, ఆవులింత లడచుకొనుచు, ఒడలు విరిచికొనుచు ‘ఓహో డాక్టరుగారు! లేవరోయి! నిద్ర పారిపోయేందుకు కాఫీఅరఖు, ఇడ్లీమాత్ర సేవిద్దువు గాని’ అని రాజారావును ఒక చరపు చరచినాడు.

రాజారావు లేచి, కోపము నభినయించుచు, ‘ఓయి బక్కవాడా నీవటోయి!’ అని పరమేశ్వరుని ప్రక్కమీద పడవైచి యదిమిపట్టినాడు.

‘ఓరి పాపిష్టిగ్రహం! బక్కాళ్లమీదా నీ బాహుబలం!’ అని ప్రక్క మీద దొర్లుచున్న రాజేశ్వరుడు లేచి, రాజారావును గబగబ రైలు తలుపు వైపుకు గెంటుకొనిపోయినాడు.