ఈ పుట ఆమోదించబడ్డది

220

నా రా య ణ రా వు


ఆ సాయంకాలము ప్యాసెంజరుబండికి పరమేశ్వరమూర్తి రాజమండ్రి స్టేషనుకురా, నారాయణరా వాతని దన బావమరది లక్ష్మీపతి యింటికి దీసి కొనిపోయెను.

ముగ్గురు స్నేహితు లా రాత్రియంతయు నిష్టాగోష్టి కాలముపుచ్చిరి. లక్ష్మీపతి దానును రావలయునని ముచ్చటపడెను గాని సెలవు దొరకుటకు వీలులేనందున ఆగిపోవలసివచ్చెను.

మరునా డుదయము రమణమ్మ తెల్లవారగట్లనే వేపుడుకూర, ఉల్లిపాయ పోపుతో కాల్చిన వంకాయ పచ్చడి, ఆవకాయ, పెరుగు వేడియన్నముతో భోజనము పెట్టినది అన్నగారికి, బరమేశ్వరునకును. మేనత్తకు నమస్కృతులిడి యామె యాశీస్సులంది, రమణమ్మను తనదగ్గరకు జేరదీసికొని ‘రమణా! నీకు, బాచిగాడికి చిత్రాలు పట్టుకొస్తానేవ్’ అని యామెతో జెప్పి లక్ష్మీపతి వెంటరా నారాయణరావు పరమేశ్వరునితో ఇన్నీసుపేట నుండి పెద్దస్టేషనుకు రెండు జట్కాలమీద బయలుదేరెను. ఇంటరులో వారిద్దరు ఖురదారోడ్డు స్టేషనుమీదుగా పూరి (జగన్నాథం)కి టిక్కెట్లు పుచ్చుకొన్నారు. పది గోల్డుఫ్లేకు సిగరెట్టుడబ్బాలు, పది త్రీకాజిల్సు డబ్బాలు పుచ్చుకొని, ఇన్ని గ్రంథములుకొని, మెయిలునెక్కి, లక్ష్మీపతిచేతిని ఝాడించి మెయిలుబండి సాగగా దానితో వారును సాగినారు.


౬ ( 6 )

ఉత్తరహిందూదేశ యాత్ర

భరతదేశము ఆదియుగమునుండియు బ్రపంచమునకు నాగరికత, మానవ ధర్మము, ఆధ్యాత్మికతత్త్వవిచారము నేర్పుచునేయున్నది. సేతుహిమాచల పూర్వ పశ్చిమ సముద్రపరివృతమగు భరతదేశమున నెన్నిజాతులు, నెన్ని రాజ్యములు నవతరించి, వృద్దియై యుత్కృష్ట సంప్రదాయముల సృజించి, నశించి పోయినవో? ఒక జాతిలోనుండి వేరొక జాతి జనించినది. నూతనజాతుల దనలో జేర్చుకొన్నది. పూర్వసంప్రదాయముల విజృంభింపజేసినది.

భిన్నత్వమున నేకత్వము, నేకత్వమున భిన్నత్వము సూచింపుచు భగవంతుని విశ్వరూపసందర్శన మన్నట్లు విజాతీయునకు భిన్నతాదూషితమై తోచుచు, మహానదివలె నెటనుండి యెటకు బోవుచున్నదో భారతీయమహా చరిత్ర! నారాయణరాయ పరమేశ్వరులకు పూరీమహాపట్టణమున, కోణార్కలో, భువనేశ్వరములో గనుపించిన కేసరి గాంగకళాచమత్కృతియు ఉత్తమనాగరికతయు వారి నాలోచనాపూరితుల, నానందవికసితులను జేసినది.

భరతదేశములో సూర్యునకు ప్రత్యేకము గుడులు రెండు మూడు చోటులనేయున్నవి. ఒకటి యోఢ్రదేశములోని కోణార్క. కాని కోణార్క దేవా