ఈ పుట ఆమోదించబడ్డది

12

నా రా య ణ రా వు

వస్తారు. కూడా వచ్చే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినరుతో టికెట్టు విషయం చూడండి. నమస్కారము’ అని లక్ష్మీపతి చేయిపట్టుకొని తన పెట్టెలోనికి గొనిపోయినాడు.


౩ ( 3 )

జమీందారుడు

విశ్వలాపురం జమీందారుగారైన లక్ష్మీసుందరప్రసాదరావుగారిది పేరెన్నికగన్న ఆఱువేల నియోగి కుటుంబము. హైదరాబాదు నవాబుగారి పరిపాలనలోనికి వచ్చిన రాజమండ్రి సర్కారు దగ్గర వెండి తలందాను, బంగారు పొన్నుకఱ్ఱ, ఇరువదియైదూళ్ళకు వీరమిరాసీలు, నాలుగు సంప్రతులకు బదస్తూలు, దివాణం పొందుతూ, ‘నిశ్శంక మహాశంక సింహమాన సకలవిద్వజ్జన ప్రముఖ సంస్థిత’ అని బిరుదుపొంది తల్లాప్రగడ నన్నయనాయని పౌత్రులు గౌరవం పొందినారు. ఆ వీరమిరాసీలు క్రమక్రమంగా చిన్న జమీగా పరిణమించినవి.

వారు నవాబులకు పన్ను కట్టుచుండిరి. వారి రాజకార్యనిపుణతకును వేగుదనమునకును, జమీ దక్షతతో పరిపాలించి యైశ్వర్యవంతముగ జేయుచున్నందుకును నవాబులు మెచ్చుకొని బంగారు తలందాను, రవ్వల ఒరగల నిశితకరవాలము, శ్వేతచ్ఛత్రము, బంగారు పల్లకీ, బిరుదునిశానీ లిచ్చి శతాశ్విక దళమునకు దళవాయిగా నొనరించిరి.

విశ్వలాపురం జమీ మొగలితుర్రు పరిపాలన క్రిందికి వచ్చినపిమ్మట నన్నయమంత్రి వంశీకుడైన తల్లాప్రగడ గజపతిరాజు మొగలితుర్రు వారికడ అమాత్యుడై రాజ్యము సర్వవిధముల విజృంభింపజేసెను. కలిదిండి మహాప్రభువు జగపతిరాయని స్వామి కార్యనిర్వహణదక్షతకు, స్వామిభక్తికి మిగుల సంతసించి, ‘మహామంత్రి, రాజవంశోద్దీపక’ అను బిరుదులు, రెండు గ్రామములతో దయ చేయించినారు.

అట్టి యుత్తమవంశమున జన్మించిన శ్రీ రాజా లక్ష్మీసుందరప్రసాదరావు, స్వకుల దీపకుడయి, సదాచార సంపన్నుడై నూతన విజ్ఞాన ప్రకాశమున తన హృదయమును గాంతిమంతము చేసికొని, పాశ్చాత్య విద్యయందును గడతేరినాడు. సంస్కృతమున బి. ఎ. పరీక్షయం దుత్తీర్ణుడయి ప్రసిద్ధ పండితుల పాదములకడ సంస్కృత భాషామృతము సేవించి, అమరభావ పులకితుడైనాడు. తాను జమీందారుడయ్యు రైతుల కష్టములు పటాపంచలయి, వారు బాగుపడిననే గాని భావిభారత భాగ్యోదయము కాదని నిశ్చయించి, పూర్వపు శాసనసభలకు నూత్న శాసనసభలకునుగూడ అధిక సంఖ్యాకులగు ప్రజలచే ప్రతినిధిగ వరింపబడి ప్రభుత్వమునకు ప్రక్కలోని బల్లెమయి మెలగినాడు.