కవిత్వ ము
123
‘ఓహో తాతా నీ దేవూరు?
నీ వేడపోతవోయ్?
ఊరులేదు వాడలేదు
దేశమంతా నీదే వూరు
ఊరిబైట చెరువుకాడ
చేరుతోనే పాదుకొంటవ్.
తాతా నీ దేవూరు
నీ వేడపోతవోయ్?
గిత్త పైన యిల్లుచుట్తావ్
ఇంటి సామానంతా కట్తావ్
బిడ్డాపాపలు కూడా నడుస్తే
యిడ్డూరాలే రాజ్యాలన్నీ.
తాతా నీ దేవూరు
నీ వేడపోతవోయ్?
బిచ్చమేసేతల్లి ఉంటే
విచ్చిపోయిన పూవే బతుకు
యేసాలేసి బైరాగవుతవు
సేతులు సూసి సుద్దులు సెపుతావు.
తాతా నీ దేవూరు
నీ వేడపోతవోయ్?’
పరమేశ్వరుడు పాట పాడుచుండగనే రాజారావక్కడకు వచ్చినాడు. ఆలము పాట ముగిసినవెనుక వచ్చినాడు. ఆతడు పరమేశ్వరుని మరల పాడుమన్నాడు. పరమేశ్వరుడు మరల పాడినాడు. సంధ్యారుణమధురిమలో పరమేశ్వరుని గొంతుక తారాశ్రుతిలో విరిసిపోయినది. పల్లెటూళ్ళలో వివిధ వేషాల తీరుగాడు బిచ్చగాండ్ర గుంపును వారి కనులయెదుట నిలిచినట్లయినవి. బిచ్చమెత్తుకొను జాతు లెన్ని శతాబ్దములనుండియో బిచ్చము లెత్తుకొనుచునే యున్నవి. జంగములు, బుడబుక్కలవారు, బైరాగులు, గంగిరెడ్ల దాసరి వారు, కొమ్మదాసరులు, కోయవారు, ఎరుకలవారు, పగటివేషగాండ్రు, విప్రవినోదులు, మంత్రగాండ్లు, అడవిచెంచులు, యానాది భాగవతులు, రామదాసులు, నూనెగుడ్డల వారు, అమ్మవారి దేవరలు, దాసులు, తోలుబొమ్మలవారు, దొమ్మరివాండ్లు రుంజలవారు, కాశీపటములవారు, భటరాజులు, బీబీనాంచారి వారలు, గంగానమ్మ భక్తులు, జంగాలు మొదలైన బిచ్చగాండ్రు వారి మనస్సీమలో జట్టు జట్టులుగా బ్రయాణము చేయుచు తోచినారు.
రాజా: నారాయణరావు! మన దేశానికి ఈ బిచ్చగాళ్లు చెదపురుగులురా!