ఈ పుట ఆమోదించబడ్డది

అ మె రి కా యా త్ర

111

స్తంభమునకుగట్టి కిరసను నూనెలో తడిపిన కఱ్ఱలను బేర్చి కాల్చుదురు. వానిని గుఱ్ఱములకుగట్టి, చచ్చునంతవరకు రాళ్లమీద నా గుఱ్ఱమును పరుగెత్తింతురు.

హిందూదేశ మమెరికనుల దృష్టిలో నొక చిత్రభూమి. భారతీయులకు మతములేదు. రాళ్లను రప్పలను గొలిచి రౌరవాది నరకమునబడు మూర్ఖులతో భరతభూమి నిండియున్నదట. కాన కోటీశ్వరభూమియగు నమెరికా, భారతభూమికి క్రైస్తవ మతప్రచారకుల బంపుచుండును. భారతభూమిలోని రాజాధిరాజులైనను, అమెరికాలోని గొప్ప హోటళ్ళలో బస చేయుటకు వీలులేదు. అమెరికా రైళ్ళలో ‘పుల్ మాను’ అను నుత్తమతరగతి బండ్లలో ప్రయాణము సలుపకూడదు.

ఉత్తంగములై లేచు సముద్రవీచికల గమనించు చూపులతో రామచంద్రు డమెరికానుగూర్చి యాడిపోసిన పంజాబీయుడగు నొక సిక్కు సోదరుని మాటలను దలపోయుచు నౌకా ముఖ్యోపరిభాగమున నడ్డముగా గట్టిన యినుపగొట్టపుకడ్డీల నానుకొని నిలుచుండి యుండెను.

జపాను దేశము నిన్ననే కొన్ని వందలమైళ్ళదూరాన మాయమై పోయినది. రాత్రియంతయు వివిధాలోచనలతో నిదురరాక, పన్నెండుగంటలకు గొంచెము కన్నుమూసి, తఱువాత నావికులు మ్రోయించిన నాలుగు గంటల చప్పడువిని మోము కడుగుకొని, శుభవస్త్రముల ధరించి, యాబాలకుడు ఓడ పైతట్టునకుబోయి సముద్రమున సూర్యోదయాద్భుతము కనుంగొనవలెనని వేచియుండెను.

ఎటు చూచినను సముద్రమే. ఆ కనుచీకటిలో ఆకసము, నీరధి ఏకమై పోయినవి. ఊయెలవలె నా మహాతరణి యిటునటు నూగుచు పోవుచున్నది. ఓడలోని యంత్రముల పెనుమ్రోతలు రామచంద్రుడున్న తావునకు మద్దెల మ్రోతవలె మాత్రము వినవచ్చుచున్నవి. ఆ శ్రుతిమేళవింపులో ఓడను ముందునకుద్రోయు ఆకుచక్రములు నీటిలో నపరిమిత వేగమున తిరుగు కవ్వపు మ్రోతయు, ఓడ ముందుభాగమున ఉక్కు (కీల్) బద్దియ నీటిలో మహావేగముగ గోయుచు బోవు గంభీర నాదమును లీనమై ఉత్కృష్ట గీతికయై యాతని హృదయమును రంజించినవి.

కలలలో, కథలలో, గ్రంథములలో, వార్తాపత్రికలలో వినబడిన విదేశకంఠములు, విదేశశబ్దములు నేడు వినిపించినప్పుడు, నూతనవర్ణములు, నూతన రేఖాప్రవాహములు, నవీన వస్తుసంబంధములు నేడు గోచరించునప్పుడు రామచంద్రుని కంతయు విచిత్రమై, విస్మయమై మాయాపూర్ణమై కనంబడి యాతడు నిస్తబ్ధుడైపోయినాడు. తాను మున్నెన్నడు విననివియు, నూహింపనివియు నగు నద్భుత సందర్భము లచట సర్వసామాన్యములై తోచి యాతనికి గనులు మూయని కలలైపోయినవి.

ఇంతలో నెవరో యాతని భుజముపై తట్టినారు.