ఈ పుట ఆమోదించబడ్డది

102

నారాయణరావు

‘కాదు, ఇక్కడే నాగదిలో కూచుండి వాయిస్తానండి.’

‘సరేలే, నీకు కులాసా లేకపోతే ఇబ్బంది లేదులే.’

‘ఇష్టం లేక కాదండి! క్రింది గదిలోకి ఎందుకని.’

శారద పరిచారికను బిలిచి సంగీతపుగదిలోనున్న వీణియ తెమ్మని యాజ్ఞ యిచ్చినది. జమిందారు గా రల్లుని జూచి ‘సంగీతపుగది ధ్వనిశాస్త్రవేత్త నొకణ్ణి కలకత్తానుండి రప్పించి తయారు చేయించినాను. చాలా చక్కగా కుదిరింది. పొడుగాటి హాలులా వుండటంవల్ల పదిమంది కూచొని వినుటకు వీలుగా ఉంటుంది. నీ స్నేహితులను పైకి తీసికొని రావోయి’ యని యనెను.

‘చిత్త’ మని నారాయణ రావు స్నేహితులను మేడమీదికి బిలిచికొని రాబోయెను.

శారద వీణియ సారెలు బిగించి, శ్రుతి మేళవించి, కలస్వనమున పాడనారంభించినది.

నారాయణ రావు, స్నేహితులువచ్చి, మేడమీద మధ్యశాలలో నాసనములపై నధివసించిరి. జగన్మోహన రావు మాత్రము శారద శయనగృహము లోనికిపోయి, యచ్చట శారద కెదురుగ నొక దిండ్లున్న సోఫాపై నుపవిష్టుడై శారదను దేరిచూడ సాగెను.

జగన్మోహనుని కుర్కురహృదయమునకు శారదా సౌందర్య మద్దముల పెట్టెలోని పలలఖండమై కలచి వేయుచుండెను.

జగన్మోహనుడు లోనికి బోవుట జూచి రాజేశ్వరరావు భ్రూయుగ్మము ముడిచినాడు.

నారాయణరావు, పరమేశ్వరుడు సంగీతలోలురై యా యానందలహరీ వేగములో దేలిపోయిరి.

అహో, విమల గాంధర్వమా! నీ వానందమూర్తివి! నిర్మలకళారూపమవు. సాక్షాత్కరించిన పరదేవతవు. నీ దర్శనమాత్రమున పవిత్రత నొందని చేత నా చేతనము లున్నయవియే! పరమశివుని డమరుక కింకిణీద్వయి నుండి జనించిన నీయం దాత్మస్వరూపమే వ్యక్తమగును. ప్రాణదుగమునిచ్చు సురభీ మతల్లివి నీవు!

ఆ సంగీతము దిశల నావరించి ప్రణవస్వరూపమయినది.