పుట:Naajeevitayatrat021599mbp.pdf/907

ఈ పుట ఆమోదించబడ్డది

చేశాయి. తుపాకులు తలక్రిందులుగా తిప్పి పట్టిన సాయుధపోలీసులు నలువైపుల నిలుచున్నారు.

మరణము దు:ఖకరమైనదే. కాని, పూర్వ వైరాలను మరపిస్తుంది. జన్మాంతర సౌహృదాలను పునరుద్భవింప జేస్తుంది.

కళా వెంకటరావుగారు - ప్రకాశంగారి భౌతిక దేహాన్ని అంబులెన్సు బండినుంచి దించి వేదికపై పెట్టడానికి చేయిసాయం చేశారు.

కస్తూరిబాయి విద్యాలయంనుంచి వచ్చిన ఆడపిల్లలు 'రామ భజన' చేశారు. మరికొందరు పెద్దలు 'గీతాపఠనం' చేశారు. వేద పండితులు 'వేద పఠనం' చేశారు.

పండిత జవహర్‌లాల్ నెహ్రూగారి పేరిట ఒక పెద్ద పువ్వుల దండను నీలం సంజీవరెడ్డిగారు మొట్ట మొదట ప్రకాశంగారి భౌతిక దేహంపై పెట్టారు. తరువాత గవర్నరుగారి పేరిట, ఆయన కార్యదర్శి రెండవ పువ్వులదండ పెట్టారు. మూడవది పండిట్ గోవింద వల్లభ పంత్‌గారి పేరిట కళా వెంకటరావుగారు పెట్టారు. ఆ తర్వాత - ఇ. సి. ఎస్. ఉద్యోగులందరి పేరునా ముఖ్య కార్యదర్శి ఎమ్. పి. పాయ్‌గారు; పోలీసుదళాల పక్షాన ఇన్స్పెక్టర్ జనరల్ నంబియారుగారు, ఆంధ్రాకాంగ్రెసు పక్షాన అల్లూరి సత్యనారాయణ రాజుగారు; తెలంగాణా కాంగ్రెసు పక్షాన నూకల సరోత్తమరెడ్డిగారు; హైదరాబాదు కాంగ్రెసు పక్షాన వాసుదేవ నాయక్‌గారు; కార్మిక సంఘాల పక్షాన రావి నారాయణరెడ్డిగారు; శాసన, శాసన విధాన, శాసన మండలుల సభ్యుల తరపున బద్దం ఎల్లారెడ్డి, మద్దం మొహిదీన్, అంజయ్య గారలు ప్రకాశంగారి దేహంపై పూలమాలలు ఉంచారు.

ఆ విధంగా సాయంకాలం నాలుగు గంటలదాకా పౌర జన ప్రవాహం నిరంతరంగా ప్రవహించసాగింది.

ఉదయమే, ప్రకాశంగారి తమ్ముడు శ్రీరాములుగారి కూతురు