విద్యాలయాన్ని వదులుకుంటామని పట్టాభిరామారావుగారు సంతోషించారు.
కాని, డబ్బు విషయమై బాధపడనక్కరలేదనీ, రెండు, మూడేండ్లలో ఈ రెండుకోట్లు సంపాదించగలమనీ, ధైర్యంతో శాసన ముసాయిదా తయారుచేయించాలని కాబినెట్లో తీర్మానించాము.
ముసాయిదా సరిచూడడానికి - వి. ఎస్. కృష్ణ, కె. రంగధామరావుగారలతో నేనే కూచోవలసి వచ్చింది. విద్యాశాఖ మంత్రి అయినా, పట్టాభిరామారావుగారు - అది ఎలాగూ జరగని పని అని, నన్నే చూసుకోమని, కార్యభారం నాపైన వేశారు.
తిరుపతిలో విశ్వవిద్యాలయ కేంద్రం పెట్టడంలో మా కొక ప్రత్యేక ఆశయముండేది. దక్షిణ ఆసియా దేశాలన్నిటిలోనుగల ప్రాచ్య కళాకేంద్రాలకు, ఇక్కడ స్థాపించబోయే విశ్వవిద్యాలయం మహా కేంద్రంగా ఉండే విధంగా దానిని ఏర్పాటు చేయాలని నిశ్చయించాము.
కాని, నివేదిక తయారుచేసిన యిద్దరూ, ఆంధ్ర విశ్వవిద్యాలయ శాసనాన్ని నమూనాగా తీసుకొని ముసాయిదా తయారుచేయడం వల్ల, పై ప్రాచ్యకళా మహాకేంద్రపు ఏర్పాట్లకు తగినంత అవకాశం లేకపోయింది.
ఎలాగయితే నేమి, మొదటి ఆశయంలో మాత్రం సంస్కృత సాహిత్యము - తత్సంస్కృతుల ప్రబోధ విస్తారములని వ్రాయడం జరిగింది.
తిరుపతి దేవస్థానంవారు ఏటేటా (అప్పుడున్న కొద్దిపాటి రాబడినిబట్టి బహుశ: 15 వ వంతు అయిఉంటుంది) 2 లక్షల 50 వేలు విశ్వవిద్యాలయానికి కేటాయింపు చేయవలసిందని యిందులో వ్రాశాము. తిరుపతి దేవస్థానం శాసనాన్ని ఆ విధంగా సవరించడానికికూడా యిందులోనే ఏర్పాటు జరిగింది. శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడానికి, విద్యాశాఖమంత్రి ఒప్పుకొన్నారు.
వేసవికాలంలో, వాల్తేరు విశ్వ విద్యాలయంలో శాసన సభ జరుగుతున్నప్పుడు, చల్లని సముద్రపుగాలి తగులుతూ ఉండగా, తిక్క