రాష్ట్రావతరణ దినాన నే నున్న పార్టీలో 27 మంది సభ్యులుండేవారు. ఆ సాయంకాలం అందులో 25 గురు మా యింటి దగ్గర సమావేశమై, నేను మంత్రి పదవి స్వీకరించడం అత్యవసరమనీ, మంచిపని చేశాననీ అభినందిస్తూ, ఒక తీర్మానంకూడా వ్రాసి ఆమోదించారు.
అయితే, ఇందులో కొందరు ఒక నెల రోజులు గడిసేసరికి, ఆ రోజున సభకు రాని మిత్రుని అభిప్రాయానుసారం నానుంచి విడిపోయారు.
అందుచేత, ప్రభుత్వ పక్షాన మాకు పదికన్నా హెచ్చు సంఖ్యాబల ముండేదికాదు.
శాసన సభా కార్యక్రమంలో సంఖ్యాబలం, నైతిక బలంకన్నా హెచ్చయినది. అందుచేతనే, పరిపాలనా విధానంలో నైతిక బలం ఫలించడం కోసమని చెప్పి, ముఖ్యమంత్రులు, ప్రధానులు సంఖ్యాబలం కోసం పలు పాట్లు పడుతూ ఉంటారు. కొందరు సంఖ్యాబలమే ప్రధానంగా చూచుకొని నైతిక బలానీ ధారపోస్తారు. పదవీ సౌభాగ్య మనుభవిస్తారు.
మరికొందరు (ఇట్టి వారు కొందరే ఉంటారు!) నైతిక బలానికే ప్రాధాన్యమిచ్చి, సంఖ్యాబలం కోసం యత్నించక పతన మవుతారు.
ఇందులో మొదటి తెగవారు రాజకీయ ప్రమాణాలు దిగజారడానికి అవకాశా లిస్తారు.
రెండవ తెగవారు నైతిక ప్రమాణాన్ని, ఔన్నత్యాన్ని దిగజార నివ్వరు. వీరు ఒక్కొక్కప్పుడు పదవీచ్యుతు లౌతారు కూడా. పదవి పోయినా, ప్రజల హృదయాలలో ప్రేమాను బంధితులై ఉంటారు.
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు ఈ రెండవ తెగకు చెందినవారు.
అట్టివారే జీవితచరిత్ర కధనానికి అర్హులు.