పుట:Naajeevitayatrat021599mbp.pdf/741

ఈ పుట ఆమోదించబడ్డది

పేరు బిషప్‌గారు) ఆయన్ను చూడ్డానికి వచ్చి మర్యాదగా, సూటిగా రెండు ప్రశ్నలు వేశారు.

మొదటిది - "మీరు ముఖ్యమంత్రి అయ్యారు గనుక, కమ్యూనిస్టుల విషయమై ప్రభుత్వం పాలసీ (నీతి)లో ఏవైనా మార్పులు కలుగవలెనా?" అన్నది.

అది విని, ప్రకాశంగారు, "నీవు లా అండ్ ఆర్డరుతో సంబంధించిన వాడవు కదా! రాజకీయ పార్టీల పేర్లతో సంబంధ మెందుకు? లా అండ్ ఆర్డర్, పార్టీలతో సంబంధం లేకుండానే అమలు పరచవలె గదా!" అన్నారు.

ఆ తర్వాత బిషప్ వేసిన రెండవ ప్రశ్న - "బకింగ్‌హామ్‌ కర్నాటిక్ మిల్లు సమ్మెలో కొందరిని తన వెంటబెట్టుకొని ఏంథోనీ అనే కార్మిక నాయకుడు అల్లరులు చేసి, చివరకు సమ్మెలో దింపాడు. అతడు ఇప్పుడు అరెస్టు అయి, ఖైదులో (under trial) ఉన్నాడు. అయితే, ఈ సమ్మె విషయమై ఏం చేయమన్నారు?" అన్నది.

అందుకు ప్రకాశంగారు, "ఆ ఏంథోనీ అనే ఆయనను ఇక్కడికి తీసుకురండి. పరిష్కారం చేద్దాము," అన్నారు.

దానిపై బిషప్, "ఈ విధంగా ఎన్నడూ జరగలే దండీ!" అన్నాడు.

"అయితే, కార్యదర్శి నీకు కావలసిన ఆర్డర్ల నిస్తాడులే," అన్నారు ప్రకాశంగారు.

కాని బిషప్, "సర్లెండి. అవన్నీ నేను చూసుకుంటాను. ఏంథోనీని ఇక్కడికి ఎప్పుడు తీసుకు రమ్మాన్నారు?" అని అడిగాడు.

"వెంటనే తీసుకురండి," అన్నారు ప్రకాశంగారు.

ఒక రెండుగంటల తర్వాత, బిషప్ ఏంథోనీగారితో ప్రకాశంగారి గదిలో హాజరయ్యాడు. ప్రకాశంగారు సమ్మె వివరాలు అన్నీ తీసుకొని, మిల్లు యజమాన వర్గంతో మాట్లాడి రెండు మూడు రోజులలో ఆ సమ్మె సమస్యను పరిష్కరించేశారు.