ఒకచోట సామ్యవాద కలకలార్బటి
రవములు - లెనినును లజ్జపరుప,
రాజితాచార్య శాసన రక్షితమ్ము
ధీప్రకాశ విభాషిత తీవ్రఫణితి
విశ్వవేదాంత పీఠికా విలసితమ్ము
రాయవేలూరి నగర కారాగృహమ్ము."
అని 16-12-40 న నేను వ్రాయడానికి అవకాశం కలిగింది. ఇంతలో ప్రభుత్వం వారు తిరుచినాపల్లి జైలులో వ్యక్తి సత్యాగ్రహం చేసిన వారికని ప్రత్యేకమైన ఏర్పాట్లుచేసి, మమ్మల్ని దాదాపు మూడు వందల మందిని అక్కడికి రవాణా చేశారు. మొదట్లో ఏర్పాట్లు సరిగా లేకపోయినా, రాను రాను కొంత వసతి కల్పించి, వేళపట్టున భోజనాలు, స్నాన సౌకర్యాలు మొదలైనవి ఏర్పాటు చేశారు. ఆవరణలోంచి ఎవరూ పారిపోవడానికి వీలులేకుండా చుట్టూ బార్బ్డ్వైర్ (ఇనుప ముళ్ళ తీగె) తో కంచెలా కట్టి, రాత్రివేళ ముఖ్యంగా దాన్ని విద్యుద్భరితం చేసేవారు. ఖైదీ లెవరూ దాన్ని దాటి పారిపోలేదు కానీ, సూపరింటెండెంటుగారి చూడచక్కని కుక్కమాత్రం ఆ కంచెలోని విద్యుదాఘాతం చేత హత మయింది.
వేలూరి జైలులో - రాజాజీ, ప్రకాశంగారలు తలవరులుగా ఏర్పడిన ప్రత్యేక బృందాలు ఇక్కడ స్థిరపడినాయి.
తిరుచినాపల్లి జైలు ఆవరణలో పెద్ద పెద్ద చింతచెట్లు మెండుగా ఉండేవి. వాటి క్రింద, ఈ ప్రత్యేక సత్యాగ్రహ బృందాలు చేరి ముచ్చటించు కొనడానికీ, వాదించుకొనడానికీ, పఠనాసక్తిని సంతృప్తిపరచుకొనడానికీ, ఇతరములైన మంతనాలకూ అవకాశాలు హెచ్చుగా ఉండేవి.
"గీతార్థసార విఖ్యాత ప్రచాతృ వి
ద్యాలయ ఘోషంబు లలము కొనగ,