పుట:Naajeevitayatrat021599mbp.pdf/504

ఈ పుట ఆమోదించబడ్డది

ఒకరోజు తెల్లవారగట్ల 4 గంటలకు వార్డర్లు ఆ వంటశాలలో పనిచేస్తూన్న ఖైదీలమీద లాఠీఛార్జీ చేశారు.

ఆ ఖైదీల అరుపులు, ఏడ్పులు, లాఠీల చప్పుళ్లు మాకు బాగా వినబడ్డాయి. కంటితో చూడకపోయినా ఆ సంఘటన హృదయ విచారకంగా ఉంది. మేము ఏమీ చెయ్యలేనీ స్థితిలో ఉన్నాం. మేమూ ఖైదీలమే అయిన కారణంగా అక్కడికి వెళ్ళడానికి కూడా మాకు అవకాశం లేదు. మర్నాడు ఆ విషయం సూపరెంటెండెంట్ గారితో చెప్పాం. ఆ తరవాత అటువంటి సంఘటనలు మేము ఆ జెయిల్లో ఉన్నంత కాలమూ జరుగలేదు.

యువక ఖైదీకి అంత్యక్రియలు

జెయిల్లో వైద్యసహాయమూ అంతమాత్రంగానే ఉండేది. ఒక రోజున ఒక సత్యాగ్రహ యువక ఖైదీ మరణించాడు. డాక్టరు సరిగా చూడని కారణంగానే ఆ కుర్రవాడు మరణించాడనే వార్త పొక్కింది. అల్లరి యేదో జరుగనుంది - యువకుల హృదయాలలో ఏదో అశాంతి బయల్దేరిందనే వార్తా పొక్కింది. దాన్తో కాస్త కలుగజేసుకుని హృదయాలను శాంతపరచి, సక్రమంగా వైద్యం జరగడానికి వలసిన అవసర చర్యలు తీసుకున్నాము. చనిపోయిన కుర్రవా డాంధ్రుడు. వాని జననీ జనకులు ఎక్కడో దూరతీరాలలో ఉన్నారు. అంత దూరంనుంచి వాని బంధువులు వచ్చేదాకా దహనాది క్రియలు ఆపడానికి అవకాశం లేదు. అందువల్ల నేనూ, ఇతర సత్యాగ్రహ మిత్రులమూ కలిసి ఆ దహనకాండ దేశ స్వాతంత్ర్యం పేరుమీదుగా జరిపించాం. అప్పట్టున ఇచ్చిన ఒక చిన్న ఉపన్యాసంలో వాని త్యాగాన్ని పొగడి, భారతమాత దు:ఖోప శమనానికి వాని అసువులు అర్పించబడ్డాయని, అది మనకు గర్వకారణమనీ, దేశంకోసం ఆత్మార్పణకు, ఆ యువకునివలె, అంతా సర్వసన్నద్ధులమయి ఉండాలనీ, ఏవేవో చెప్పి యువక హృదయాలలో శాంతి నెలకొల్పాం.