పుట:Naajeevitayatrat021599mbp.pdf/299

ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాగ్రహ క్రమం

మున్ముందుగా వారు ఆలయ ప్రాంతానికి వెళ్ళే తీరు గమనిద్దాం. భజన కీర్తనలతో, పాటలతో ఉత్సాహంగా ఆలయ ద్వారం దగ్గరకు బయల్దేరేవారు. ప్రతిసారి, నలుగు రైదుగురు వ్యక్తులు మాత్రమే ఒక చిన్న బాచ్‌గా వెళ్ళేవారు. వారి మెడలో పూలమాల లుండేవి. "దెబ్బలు తగలనీ, ప్రాణాలు పోనీ-భగవదాలయంలోకి వెళ్ళి తీరుతాం" అన్న భావం వ్యక్తంచేసే కీర్తనలు అందరూ ఏకగ్రీవంగా పాడుకుంటూ వెళ్ళేవారు. "మీరు ఈ భౌతిక దేహాన్ని కించపెట్టగలరు. హింసింపగలరు. చంపగలరు. కాని మా ఆత్మలు మాత్రం ఏవిధమయిన అడ్డంకులూ లేకుండా ఆ భగవత్సాన్నిథ్యాన్ని చేరుకుంటాయి. ఆ ఆత్మలు భగవంతుని జేరకుండా మీరు ఆపలేరు," అని ఆ పాటల ఆఖరు చరణాల అర్థం.

మేము పైన ఉండి చూస్తున్నాం. బాచ్ తర్వాత బాచ్‌గా వస్తూన్న ఆ అకాలీలను నిర్ధాక్షిణ్యంగా బాదేవారు. శరీరమంతా కుళ్ళబొడిచేవారు. చివరికి స్మృతి తప్పి పడిపోయే వరకూ వారికి దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉండేది. దెబ్బలు తగిలిన వారిని తమ ఆస్పత్రికి తీసుకు వెళ్ళడానికి వారి సొంత యాంబ్యులెన్సుకారు సిద్ధంగానే ఉండేది. పోలీసువారి యాంబ్యులెన్సు కార్లూ ఉండేవి. ఆ ప్రభుత్వపు యాంబ్యులెన్సు కారులో ఎక్కించడానికి మోసుకునివచ్చే లోపల, ఏసత్యాగ్రహికైనా కర్మంచాలక అనండి, అదృష్టవశాత్తూ అనండి, తెలివిగనుక వస్తే, అతను ఆ ప్రభుత్వపు కార్లలో ఎక్కడానికి నిరాకరించేవాడు. "మమ్మల్ని మా కారులోనే పడేయవయ్యా" అని అరిచేవారు ఆ క్షతగ్రాతులు. ఆ ప్రకారమే జరిగేది.

అహింసా వ్రతం

అక్కడనుంచి వారి ఆస్పత్రి చూడ్డానికి వెళ్ళాం. మేము లోపలికి వెళ్ళేసరికి దెబ్బలు తిన్న ప్రతి వ్యక్తి మంచంమీద వెల్ల