పుట:Naajeevitayatrat021599mbp.pdf/245

ఈ పుట ఆమోదించబడ్డది

విశ్రాంతి తీసుకోమని సలహా యిచ్చారు. గస్తీలోవున్న మిలిటరీ వారికీ మాకూ సంఘర్షణ జరుగవచ్చునని కూడా మమ్మల్ని హెచ్చరించారు.

మెయిన్ రోడ్డువదలి, ప్రక్కగా, రెండు మూడు పర్లాంగుల దూరంలో ఉన్న "చెర్పల్‌చేరీ" గ్రామం, నిజంగా, మేము అదృష్టవశాత్తే చేరామని భావించవలసి ఉంటుంది. మెయిన్ రోడ్డువదలి ప్రక్కనున్న బండిబాటని మేము నడక ప్రారంభించిన కొద్ది సేపట్లోనే గుర్రాలమీద వచ్చిన మిలిటరీవారు ఆప్రాంతం అంతా గాలించారనీ, నిజంగా మేమే గనుక మా ఖద్దరు దుస్తులతో వారి కంటబడి ఉంటే తక్షణమే మమ్మల్ని కాల్చేసేవారనీ, మా వెనకాలే ఆ గ్రామానికి వచ్చిన వారు చెప్పారు. ఆ రాత్రికి మేము అక్కడే విశ్రమించాం.

తెల్లవారేసరికి వెంకట్రామయ్యరు తాను మద్రాసు వెళ్ళిపోవడానికే నిశ్చయించుకున్నాననీ, అందువలన నాతోబాటు యింక ముందుకు సాగలేననీ కచ్చితంగా చెప్పేశాడు. ఆయన నాకంటె వయస్సులో పెద్దవాడు. విద్రోహ చర్యలుగా దారిలో ఏర్పడిన అడ్డంకుల నన్నింటినీ అధిగమించి ఆ వయస్సులో ఆ యాత్ర ముగించలేనని ఆయన వ్యక్తపరిచాడు. ఆయన వెనక్కి వెళ్ళడానికి నేను అంగీకరించాను. ఇద్దరు మిత్రుల సాయంతో ఆ సాయంత్రానికి ఒట్ట పాలియం జేరుకుని, ఆయన రాత్రి బండికి పట్నం వెళ్ళిపోయాడు.

ఏమయినా సరే మేము మీతో వచ్చి తీర్తాము అంటూ బయల్దేరిన నలుగురు మిత్రులతో నేను చెర్పల్‌చేరీ గ్రామం నుండి కాలికట్టుకు బయల్దేరాను. దారి పొడుగునా రోడ్డంతా ఒకే మాదిరిగా ఉంది. రెండవరోజు సాయంత్రానికి యింకో యిరవై మైళ్ళు నడవ గలిగాము. మూడవనాటి సాయంత్రానికిగాని నేను కాలికట్టు చేరలేకపోయాను.

భయోత్పాత పరిస్థితులు

ఉద్రేక పూరిత పరిస్థితులలో ఉన్న కాంగ్రెసు మిత్రులు నన్ను ఆహ్వానించారు. విప్లవ ప్రాంతంలోని ముఖ్య కాంగ్రెసు నాయకులందరినీ పోలీసువారు అరెస్టు చేశారు. విప్లవ ప్రాంతంలో పర్యటించిన బార్ యట్ లా కే.పి.కేశవమేనోన్ అప్పుడే తిరిగి వచ్చాడు. ఒక