పుట:Naajeevitayatrat021599mbp.pdf/213

ఈ పుట ఆమోదించబడ్డది

చెందిన "ర్యాలి" గ్రామం యీ నిర్మాణ కార్యక్రమ సాధనలో బాగా ముందంజవేసి ఆదర్శప్రాయంగా తయారయింది. ఆ గ్రామంలో కాంగ్రెసువారు ఏర్పాటుజేసిన పంచాయతీ కోర్టు శక్తివంచన లేకుండా పనిచేస్తూ న్యాయ (సివిలు), రక్షణ (క్రిమినలు) లకు సంబందించిన ఫిర్యాదుల నన్నింటినీ న్యాయంగాను, నిష్పాక్షికంగానూ విచారించడం జరుగుతూన్న కారణంగా ఆ గ్రామంనుంచి ఒక్క కేసయినా యిటు మేజస్ట్రీటు కోర్టుకుగాని, అటు మునసబు కోర్టుకుగాని పోలేదు. గ్రామంలోని పార్టీ విభేదాలూ, అంత:కలహాలూ అంతరించాయి. కేవలం నాల్గణాలు కోర్టుపీజు క్రింద చెల్లిస్తే ఎన్నివేల రూపాయల విలువగల లావాదేవీలయినా పంచాయతీవారు పరిష్కరించేవారు. క్రిమినలు కేసులూ అంతే. ఆ గ్రామంనుంచి ఒక్క పోలీసు కంప్లయింటయినా పైకి పోలేదు. అవసరాలకు కావలసిన ఖద్దరుబట్ట యావత్తూ గ్రామంలోనే ఉత్పత్తి అయ్యేది.

ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని చుట్టుపట్ల గ్రామాలెన్నో యీ విధానాన్ని అనుకరించడం ఆరంభించాయి. దాన్తో ఏదో ఒక విధంగా ఈ విధానాలకు స్వస్తి చెప్పించి తీరాలనే దృఢనిశ్చయం ప్రభుత్వంవారికి కలిగింది.

పాలకుల దమసనీతి

ఆ గ్రామ పెద్దలనూ, నాయకులనూ ఏదో ఒక సాకుతో ఒకసారేమిటి. రెండుసార్లేమిటి - అవసరమని వారు అనుకున్నన్ని సార్లు నిర్బంధించి జైళ్ళపాలుజేసి గ్రామంలో నాటుకుపోతూన్న ఆశయాలకు అంకుశపు పోటు పొడిచి మరీ వదిలారు. దీనినిబట్టి కాంగ్రెసువారి నిర్మాణ కార్యక్రమం గ్రామీణుల హృదయాంతరాళాలలో యెంత లోతుగా నాటుకుపోయిందో అర్థం అవుతుంది. అంతేకాదు. అ జిల్లాలోనూ, ఇతర ప్రాంతాలలోనూ, రాష్ట్రాలలోనూకూడా కాంగ్రెస్సును అణగద్రొక్కడానికి ప్రభుత్వంవారు అవలంబించిన బీభత్స విధానమూ అర్థం అవుతుంది. ఈ విధంగా కాంగ్రెసు నిర్మాణాత్మక విధానాన్ని అణగద్రొక్క గలిగిన ప్రభుత్వంవారు తమ దృష్టిని హిందూ-మహమ్మదీయ మైత్రిని చేధించడానికి మళ్ళించారు. హిందూ మహమ్మదీయ