ఓం నమో వేంకటేశాయ
ముందుమూట
భూమన కరుణాకరరెడ్డి 27.01.2008.
అధ్యక్షులు
తి. తి. దేవస్థానపాలకమండలి,
తిరుపతి.
తిరుమల తిరుపతి దేవస్థానాలు చేపట్టి పురోగమిస్తున్న అనేక సామాజిక, సాహిత్య తాత్త్విక, భక్తి, ధార్మిక ప్రచార కార్యక్రమాలు ప్రజల్లో నూతనోత్తేజాన్ని పెంపొందింప జేస్తున్నాయి. ఈ మార్గంలో రామాయణ భారత భాగవతాదిగ్రంథాల్ని వివరణాత్మకంగా సామాన్యప్రజలకు సైతం అర్ధమయి, అందుబాటులో ఉండేవిధంగా ప్రచురిస్తున్నాము. అన్నమయ్య, వెంగమాంబ సాహిత్యాన్ని విశేషంగా ప్రజలవద్దకు తీసుకువెళ్లేందుకు శతధా కృషి చేస్తున్నాము. ప్రాచీనసాహిత్యంలో , నవీన సాహిత్యంలో ధార్మికాంశాలు విశేషంగా ఉన్నవాటిల్ని నేరుగానూ, ఆర్థిక సహాయం అందించడం ద్వారానూ ప్రచురిస్తున్నాము. ఈ మధ్య “శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రివాజ్మయపీఠాన్ని శ్వేతలో నెలకొల్పి, శ్రీప్రభాకరశాస్త్రిగారి సాహిత్యాన్నీ అన్నమయ్య కీర్తనల పరిశోధనలో వారుగావించిన కృషినీ, సహృదయ సమాజం చిరకాలం గుర్తుంచుకొనేట్టుగా కార్యక్రమాలు రూపొందించి, నిర్వహిస్తున్నాము. శ్రీప్రభాకరశాస్త్రిగారు సంస్కృతాంధ్రాల్లో గొప్పపండితులు. తెలుగులో అనేకాంశాలపై ఎంతో పరిశోధించి, అనేక నూతనాంశాలు వెల్వరించారు.