24
మీఁగడ తఱకలు
రాజుగారి ఆగ్రహము
ఈ ఘోరకార్యమునకుఁ గోపించి రాజు పండితారాధ్యులవారి కనులు దోడించెను. శివానుగ్రహమున నారాధ్యులవారికి మరలఁ గనులు వచ్చినవఁట! రాజును, దద్రాజ్యమును నాశ మగునట్లు శపించి, యారాధ్యులవా రక్కడనుండి సశిష్యులై, కల్యాణకటకమున వీరశైవమత ప్రతిష్ఠాపనాచార్యుఁడై ప్రఖ్యాతిఁగనుచున్నబసవేశ్వరుని దర్శింపఁ బయన మయిరి. బసవేశ్వరుని శివభక్తిపరాకాష్ఠకుఁ బరమాదరమును, వైదికవర్ణధర్మపరిత్యాగమునకు నప్రీతియుఁ గలవారై యాయనతోఁ జర్చించుటకే పండితారాధ్యు లట్లు వెడలి రందురు. 'భక్తిమీఁదివలపు, బ్రాహ్మ్యంబుతోఁ బొత్తు, పాయలేను నేను బసవలింగ' యని బసవేశ్వరుని కారాధ్యులవారు వార్త పంపిరఁట! అమరావతి, నడుగుడుములు (నేcటి నడుగూడెము-మునగాల పరగణాలోనిది) పానగల్లు పురములమీఁదుగాఁ గల్యాణమునకుఁ బోవుచు వనిపుర మనుగ్రామమున నుండఁగా బసవేశ్వరుఁ డప్పటి కెనిమిదిదినములకు ముందు లింగైక్య మందుట పండితారాధ్యులకు తెలియవచ్చెను. పండితుఁడు చాల విలపించి యక్కడనుండి శ్రీశైలమునకు వెడలి, యల్పకాలమునకే యక్కడఁ దానును లింగైక్యమందెను. ఇది పండితారాధ్యుల చరిత్రసారము. దీనిని బెంచి పెద్దచేసి పాల్కురికి సోమనాథుఁ డయిదు ప్రకరణముల ద్విపద గ్రంథముగాఁ బండితారాధ్యచరిత్రము రచియించెను. సోమనాథుని ద్విపదగ్రంథమున పండితారాధ్యుల శివతత్త్వసారము చాలఁగా ననువాదముఁబడసినది. సోమనాథుని ద్విపదపండితారాధ్యచరిత్రము ననుసరించి కవిసార్వభౌముఁడు శ్రీనాథుఁడు పద్యకావ్యముగాఁ బండితారాధ్య చరిత్రమును శృంగారనైషధకృతిపతియగు మామిడిసింగమంత్రియన్నకు ప్రెగ్గడయ్యకుఁ గృతిగా రచించినాఁడఁట! అది యిప్పుడు గానరాదు.