పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/389

ఈ పుట ఆమోదించబడ్డది

328

మహాపురుషుల జీవితములు

విద్యార్థులను లోకయాత్రలో నిరపాయముగ నడుచువారిగఁజేయుట కతఁడు పాటుపడుచుండును", ఆయనకు మహారాష్ట్రభాషలో మంచి ప్రవేశము గలుగుటచేఁ జిన్న తనమునుండియు నతఁడందుఁ గవిత్వము చెప్పెను. బాల్యమునం దాయన వ్రాసిన పద్యములు దొరకలేదు. మరణమునకుఁ గొన్ని మాసములక్రిందట నాంగ్లేయభాషలో గోల్డుస్మిత్తు మహాకవివ్రాసిన వానప్రస్థుఁడని యర్థమువచ్చు "హెర్మి" ట్టను పద్య కావ్యమును మహారాష్ట్రమునకు తర్జుమాచేసెను. అది యిప్పటికిని మహారాష్ట్రజనులచేత సంతోషపూర్వకముగా జదువఁబడుచున్నది. ఆయనకు సంస్కృతమునుండియు మహారాష్ట్రము నుండియుఁ బ్రాచీన మహాకవులు రచియించిన శ్లోకములెన్నియో గంఠపాఠముగఁ జదువఁ గల శక్తియుండెను. స్వకుటుంబములోనున్న వారి నీగోపాలరావప్పుడప్పుడు చిత్రచిత్రశ్లోకములు చదివి సంతోషపెట్టుచుండును. గోపాలరావునకు సంగీతశాస్త్రమునందును గొంత ప్రజ్ఞ గలదు. మంచిపాటను వినియాయన మిక్కిలి మెచ్చువాఁడు. గోపాలరావు పాఠశాలలో బాలురకు విద్య చెప్పి వారి మనస్సుల నెంత వికసింపఁజేసి జ్ఞానవంతములుగ జేసెనో యావిధముగా బడి లేనప్పుడు గృహమందు గూర్చుండి తనతో మాటలాడ వచ్చిన పరిచితులను మిత్రులను విజ్ఞానగర్భితములగు తనసంభాషములచేత వచ్చినప్పటికంటె నెక్కువ వివేకులుగఁజేసి బంపుచుండును. ఆయనతో మాటలాడుటయెంతో లాభకరముగా నుండును. ఆయనయేదిమాటలాడినను ముందుగయోచించి యుక్తియుక్తముగ సర్వజనగ్రాహ్యముగ నుండునట్లు మాటలాడును. జ్ఞానమితరులకునుపదేశించుట వారి కెంతయిష్టమో నేర్చికొనవలసిన యంశములుండిన నితరులవద్దనుండి యవి నేర్చికొనుటయు వారి కంతయిష్టము. నిరంతరము గ్రంథపఠనమందాసక్తి యుండుటచేతను నూతన జ్ఞాన మార్జింప నభిలాష