స్థలము 8 : రాజమందిరము.
_________
[రాజు ఖిన్నమానసుఁడై, సోఫాపై కూర్చుండి యుండును]
రాణా : ఇంతవఱకె యీ యపవాదము నగర మెల్లెడల మాఱు మ్రోగుచుండును. పనిపాటులేని సోమరిపోతులు రచ్చకొట్టములలోఁ గూర్చుండి గోరంత కింవదంతిని కొండంత సత్యముగ పెంచి వితర్కించుచు, ఆనందించుచు ప్రొద్దు ప్రుచ్చుకొనుచుందురు కాఁబోలు ! ఇంకను ఆ కళంక వతిని బ్రతుకనిచ్చి నందులకు రాజపుత్ర యువకులు నన్ను దూషించుచుందురు. నా బ్రతుకు నగుఁబాట్ల పాలైనది. - ఎంత సాహసవతి ! తన దుష్కార్యమును గప్పిపుచ్చుటకు అసత్య మాడుచున్నది!
[మంత్రులు ప్రవేశింతురు.]
రాణా : [చిత్తోద్వేగము నడచుకొని] అమాత్యులారా, మీరా ఒక దేవత యనియు, సత్యవ్రత యనియు, మీరు విశ్వసించి యుంటిరి. మీ విశ్వాసము మూఢభక్తియనియు అస్థానికమనియు ఆ దుశ్చరితయొక్క యసత్య వాదనమె నిరూపించుచున్నది - వేయినోళ్ళ ఘోషించుచున్నది.
శ్యామ : రాణిగా రేమిచెప్పిరి?
రాణా : పూజ్యురాలైన మీరాణిగారు అంత:పురమునకు నిన్న వైద్యులెవ్వరును వచ్చియుండలేదని సెలవిచ్చిరి.
మాధ : అది యెట్లు ?
రాణా : ఎట్లో బుద్ధిమంతులు మీరే యోచింపుఁడు.
మాధ : [సంశయముగ] రాణిగా రేల యబద్ధ మాడవలయును ?