పుట:Kulashekhara-mahiipaala-charitramu.pdf/27

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వడఁద్రోళ్లు వెట్టిన వెడఁద పెందొడలపై
               సారెసారెకు మల్ల సఱుచువారు
పటుతరాయుధము లిట్టటు ద్రిప్పికొనుచు బే
               ర్వాడి లక్ష్యమ్ముల వైచువారు


తే.

నగుచు వనచరభటులు సాహసికవృత్తి
గ్రామ్యబలముల నృపవరుఁ గడచి కలిసి
శరభశార్దూలసింహకాసరము లాది
యగు మృగమ్ములఁ బడవైచి రలవు మెఱసి.

73


క.

అత్తఱి నాగరవీరుల
మొత్తము లారణ్యకులు నమోఘ[సిత]శరా
యత్తములఁ జేసి వివిధమృ
గోత్తమములు నవనిఁ గూల్చి రుగ్రార్భటులన్.

74


తే.

జీవురులనంటి వలలకుఁ జేర్చి బోను
లందుఁ జొఱఁద్రోలి యురులచే డిందుపఱచి
పొసఁగఁబట్టిరి, కొన్నింటిఁ బొడవడంచి
రెలమి ఖగముల మృగముల నలవు మెఱసి.

75


భుజంగప్రయాతం.

జగద్భీకరాత్మీయసైన్యంబు లిట్లా
మృగస్తోమముం ద్రుంచి మెప్పించువేళన్
మొగమ్మందు నుత్సాహమున్ సొంపు దోడై
తగన్ ఘాటమున్ గాలఁ దాఁటించె లీలన్.

76


క.

ఘోటకము దుముకఁజేయుచుఁ
బాటవమున విల్లు బూని పటుమేఘనిరా
ఘాటధ్వని పురణింపఁగ
జ్యాటంకృతు లెసఁగఁజేసె జనవరుఁ డెలమిన్.

77


క.

ఈరీతి నిజగుణధ్వని
క్రూరత నందంద వెడలి రోదసి నిండన్
జేరువ నొకయీరమ్మున
గూరికియున్నట్టి లేడి గుండియ లవియన్.

78