25. గయుని నిమిత్తము కృష్ణార్జునులు కలహించుట సుభద్రాదుల తలంపు
ఇరువురు వినకుండి రెవ్వరీపోరాపఁ
గలరొ? యంచు సుభద్ర కళవళింప
నొక్కటికన్ను వేఱొక్కటి చెవియయ్యె
నెట్లంచు వసుదేవుఁడెదఁదపింప
నేటికివచ్చెనేఁ డీమాయ గయుఁడంచు
దేవకీదేవి లోదిగులుఁ జెందఁ
గ్రీడిస్వభావంబు నేఁడైన హరిబుద్ది
కెక్కదే యని హలి యెంచి తెలుపఁ
గార్యగతులెంచి, కౌరవ గణమునొంచి
గయుని మన్నించి, కవ్వడి గారవించి
స్ఫూర్జితాస్త్రోప సంహారములఘటించి
హర్షమొదవించెఁదనవారి కచ్యుతుండు
26. సమస్య : పాముపడగనీడ నెలుక బాగుగఁ బండెన్
భీమమగుజాతి వైరం
బేమాత్రము లేక మైత్రి యిమ్ముగ విఘ్న
స్వామి పదాభరణంబగు
పాముపడగ నీడ నెలుక బాగుగఁ బండెన్
27. కవీశ్వరుల నితరులకంటె హెచ్చుగా నేలగౌరవింతురు?
అనిలుఁడుదక్క దేహులకుఁ బ్రాణసుఖస్థితిఁగూర్పలేరొరుల్
కనుఁగొననట్లు, సత్కవి యొకండె వివేకులకీర్తి, ధాత్రియుం
డిన వఱకుంచుఁ గాకొరులు నేరరు తద్విధికంచు సత్కవీం
ద్రునొరులకంటె నెక్కుడగఁదోప బహూకృతుఁజేతురుత్తముల్