నెమ్మదిగ మామూలుమనుష్యులము కాగలిగితిమి. ఆకాలములో రైళ్లులేని కారణమున బందరో, కాకినాడో చేరుస్టీమర్లు దొరికినప్పుడే ప్రయాణముసాధ్యమగుటచేత అట్టిప్రయాణమును వ్యయప్రయాసలతో కూడియుండుటచేతను గుంటూరు చెన్నపట్టణములమధ్య రాకపోకలు మిక్కిలి కష్టసాధ్యముగనుండెను.
ఈచెన్నపట్టణపు కాలువమీదనే నేను గుంటూరుమిషన్ హైస్కూలులో చదువుచున్నకాలమున మేడముబ్లావాట్స్కియును, కల్నల్ ఆల్కాట్గారును చేబ్రోలుచేరి, చేబ్రోలునుండి గుంటూరువచ్చిరి. ఆదినములలో కాలువ దిబ్బలువేయక మంచి స్థితిలో నుండెనేమో. థియసాఫికల్ సొసైటీ అనగా దివ్యజ్ఞాన సమాజ మప్పుడే యాయూర స్థాపించబడెను. అప్పుడు గుంటూరులో మాడభూషి వేదాంతం వెంకటాచార్యులుగారు అను గొప్పసంస్కృతపండితు లొక రుండిరి. వారు ఏకసంధాగ్రాహి యని పేరుపొందిరి. ఏవిషయమైనను ఒక్కసారి చదివినను వినినను దానిని ఏమియు మరచిపోక అంతయు పాఠముగ చెప్పగల బుద్ధి సామర్థ్యము వారి కుండెను. మాడము బ్లావట్స్కీగారు రుషియాదేశవాసి యగుటచే ఆమె దేశభాషలో నేదియో చెప్పిన దానిని ఆపండితుడు విని వెంటనే తప్పులేకుండ ఒప్పజెప్పెనట. ఈయన మరియొకసారి జిల్లాకోర్టులో నూజవీడు జమీందారీ కేసులో సాక్షిగ విచారించబడెను. అప్పుడు చాలదీర్ఘమగు వాజ్మూలమునిచ్చియుండెను. దాని నంతయు తాను చెప్పినది చెప్పినట్లు మొదటినుండి తుదివరకు మరల ఏకరువుపెట్టెనని సాధారణముగ చెప్పుకొనుచుండిరి. వీరు ఇప్పుడు గుంటూరులో