యువకులు కొందరు అచట చేరి కావించుచున్న చారిత్రాత్మక పరిశోధనలనుగురించి వారు మాకు తెలియజెప్పిరి.
ఈమధ్యకాలములో చెన్నపురిశాసనసభలో నొక విచిత్రోదంతము నడిచెను. గుంటూరు, నెల్లూరుజిల్లాలలో మెట్ట భూములు వర్షాభావముచే ఫలించక ప్రజలు మాటిమాటికి క్షామబాధచే పీడితులగుచుండుటచే కృష్ణానదికి గుంటూరుజిల్లాలోని తెలుకుట్లగ్రామమునకు దిగువను ఆనకట్టకట్టి అక్కడనుండి కాలువలు త్రవ్వి, పినాకినిపంటకాలువలలో కలిపి, రెండుజిల్లాలును సుభిక్షముగావించుటకు "కృష్ణారిజర్వాయరుప్రాజెక్టు" అనుపేరుతో నొకసన్నాహము ప్రభుత్వము సాగించెను. చాల విమర్శలు జరిగినపిమ్మట ఏడుకోట్లరూపాయలు దాని వ్యయమునకు నిర్ణయింపబడెను. ప్లానులు అంచనాలు అంగీకృతములై పనులు కొలదిదినములలో ప్రారంభింతురని ప్రజలు ఉవ్వెళ్లూరు చుండిరి. ఇట్టిసమయమున దక్షిణమున మెట్టూరుదగ్గర కావేరినదిమీద ఆనకట్టకట్టుట కొక ప్రణాళిక నాలుగుకోట్లరూపాయల వ్యయముతో సిద్ధముగానున్నదిగావున ముందు దానినిపూర్తిచేసి ఆమీద హెచ్చుఖర్చులు పెట్టవలసిన కృష్ణారిజర్వాయరుప్రాజెక్టు సాగించవచ్చునని చెన్నపురిశాసనసభలో తీర్మానించబడినది. అప్పుడు పానుగల్, బొబ్బిలిరాజాగార్లు మొదలగు జస్టిసుపార్టీ ప్రముఖులు ఆంధ్రులై యుండియు దాక్షిణాత్యులకు లోబడిరి. మెట్టూరు నాలుగుకోట్లనుకొన్నది పదునాలుగుకోట్లకు మించివ్యయమైనను సాగినది. కృష్ణారిజర్వాయరుప్రాజెక్టు మూలబడి పోయినది.