ఈ పుట ఆమోదించబడ్డది

అసలు కథపేరు 'పొలం'. కథ ఏమిటయ్యా అంటే-పొలందున్నుకునే ఒక రైతుకు అందమయిన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చదువుకుంటానంటుంది. రైతుసంఘంలో చేరిన ఆ చిన్నరైతు చదువుకుంటానన్న తన బాలికను తమ జిల్లా పట్టణం పంపించి చదివిస్తాడు. కథానాయిక తండ్రి హిందూస్తానీ సంస్కృతమూ చదువుకున్నవాడు. చిన్నతనంలో రెండవ ఫారమువరకూ ఇంగ్లీషు చదువుకున్నవాడు. రైతు నాయకుడై కిసాన్ సభలలో ముఖ్యునిగా పేరు సంపాదించుకొన్నాడు. స్వంత వ్యవసాయం.

మన రైతునాయకుడు వెంకటస్వామి. ఆయన్ను అందరూ చాలా గౌరవిస్తారు. గాంధీతత్వవాది, ఖద్దరాభిమాని, కాంగ్రెసులో సభ్యుడు. అప్పుడే రెండుసారులు జైలుకు వెళ్ళివచ్చాడు.

రైతు రెడ్డికులంవాడు. ఆయన కొమరిత కమలాక్షీదేవి ప్రవేశపరీక్షలో కృతార్ధత నొంది కాలేజీ చదువుకు కాకినాడ వెడుతుంది. ఈ అమ్మాయి ఇంటరు చదువుతోంటే కమ్మవారి కులానికి చెందిన ప్రసాదరావు అనే యువకుడు బి.యస్.సి. సీనియర్ చదువుతూ ఉంటాడు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు.

ప్రసాదరావు తండ్రి ఒక పెద్దరైతు. అతని జిల్లా వేరు. వ్యవసాయం మెరక వ్యవసాయం, తండ్రి ప్రభుత్వ పక్షపాతి. రైతు సంఘాలకు వ్యతిరేకుడు, పూర్వాచార పరాయణుడు. ఆ పెద్ద రైతు తన కుమారుడు ఇతర కులానికి చెందిన ఒక బాలికను వివాహం చేసుకోకూడదంటాడు.

తండ్రి భావాలు కుమారుడు ప్రసాదరావుకు ఇష్టంలేదు. తండ్రి ఇంక చదువు చెప్పించనక్కరలేదనీ, తనకు తండ్రి ఆస్తి ఏమీ అక్కరలేదనీ, ఉత్తరం వ్రాసి కాలేజీ చదువు మాని దేశాలు తెగించి పోతాడు.

ఇవతల కమలాక్షీదేవీ, అవతల ప్రసాదరావు తల్లీ ప్రసాదుకోసం దుఃఖిస్తూ ఉంటారు.

ప్రసాదరావు వేరే జిల్లాలో కొంత భూమి ఒక పెద్ద రైతు దగ్గర కౌలుకు పుచ్చుకొని, అతని దగ్గిరే పెట్టుబడికి నూరురూపాయలు పుచ్చుకుని వ్యవసాయం ప్రారంభిస్తాడు. నాలుగెకరాల భూమి కొత్త పద్ధతులతో అందమైనతోట అయి అతనికి మంచి రాబడి యిస్తుంది. రైతు పెట్టిన పెట్టుబడి బాకీతీర్చి. ఇంకో వందరూపాయలు ఆ తోటపనికి ఉంచుకుని, తక్కిన నూరురూపాయలతో కథానాయిక ఊరువస్తాడు.

కథానాయిక తండ్రి తన కొమరితను నాయకునికి వివాహం చేయడానికి సందేహిస్తాడు. ఒకరు కమ్మవారు. ఒకరు రెడ్లు. కథానాయకుడు వెళ్ళిపోతూఉంటే కథానాయిక అతన్ని కొంతదూరంలో కలుసుకుంటుంది. ఇద్దరూ వెళ్ళి చెన్నపట్నంలో వివాహం చేసుకుంటారు.

కథానాయకుడు పొలందున్నుతూ, నాయిక చెట్లు పాతుకుంటూ తోటపని వాళ్ళవుతారు. కథానాయకుడు రైతుసంఘ కార్యదర్శి అవుతాడు.

చివరకు ప్రసాదు తల్లి భర్తను వ్యతిరేకించి, తన ఇల్లు వదిలి కొడుకు దగ్గరకు వచ్చి ఉంటుంది. గాంధీగారు ఆ గ్రామం వచ్చినప్పుడు ప్రసాదు తోటలో మకాం చేస్తారు.

ఇదంతా విని, భార్యాభర్తల తండ్రులిరువురు ఒకరికి తెలియకుండా ఒకరు ప్రసాదును, కమలాక్షిని చూడడానికి వస్తారు. అయిదునెలల బిడ్డడు మోహనదాసు ప్రసాదుకూ కమలాక్షికీ.