పుట:Konangi by Adavi Bapiraju.pdf/284

ఈ పుట ఆమోదించబడ్డది

 రెడ్డిగారి కిష్టమయిన విషయమని వైద్యాన్ని గూర్చి చౌధురాణి సంభాషణ ప్రారంభిస్తే, చౌధురాణి కిష్టమైన విషయమని రెడ్డి చిత్రలేఖనాన్ని ప్రారంభిస్తాడు. చౌధురాణి కమ్యూనిజాన్ని గురించి మాట్లాడడం ప్రారంభించేది.

ఆ సంభాషణ అంతంత మాత్రంగనే సాగేది. హృదయంలో సంభాషించదలచుకొన్న విషయం వేరు, పైకి వచ్చే సంభాషణ వేరు. హిమాలయాలలో ధాన్యం పండదు. కుంకుమపువ్వు ఆంధ్రదేశంలో పండదు.

కంచి చేరారు. వరదరాజ స్వామిదేవాలయం చూచినారు. ఏకాంబరేశ్వరుని దేవాలయం చూశారు. కంచికామాక్షీ ఆలయం దర్శించినారు.

సాయంకాలం వారు ఒక బంగాళాలో మకాం పెట్టినారు. బంగళా బంట్రోతుచేత పడకకుర్చీలు పైన వేయించినాడు డాక్టరు ఎన్నో పువ్వులు కొన్నాడు. రెడ్డి వంటవాడు శాకాహారమైన అందాల వంటకాలెన్నో చేసినాడు. వెన్నెల కాస్తూ ఉంది.

భోజనాలు చేసి పడక కుర్చీలలో కూర్చొని ఏ విషయం చేతికందితే ఆ విషయాన్ని గూర్చి మాట్లాడుకొంటూ నిశ్శబ్దం వహించారు. ఇద్దరూ స్వప్నాలపాలయ్యారు. ఒకరి స్వప్నానికి రెండోవారు స్వప్నమధ్యస్థులయ్యారు.

డాక్టరు రెడ్డి తరపున కోనంగి చౌధురాణిని ఆడగడం, ఆమె రెడ్డిగార్ని వివాహ మాడడానికి ఒప్పుకోడం, ఆ విషయం ఉత్తరం ద్వారా రెడ్డికి తెలియజేసి కోనంగిరావు తాను అరెస్టు అవడం, ఇవీ డాక్టరు రెడ్డికి చౌధురాణికీ జరిగిన ప్రణయ కార్యకలాపం.

ఆ తర్వాత ఇద్దరూ ప్రణయ వాక్యాలు తప్ప ఏవైనా మాట్లాడుకొనే వారు. ఆ మాటలు ఏ ధ్వని సూత్రాల ప్రకారం చూచినా ప్రణయాన్ని స్ఫురింపజేయలేవు.

చౌధురాణి తన రాజకుమారుడయిన రెడ్డి మదరాసులో ఉంటాడని అనుకోలేదు. రెడ్డిని చూడగానే మొదట చౌధురాణికి చాలా కోపంగా ఉండేది. ఆ కోపానికి కారణం రెడ్డిగారు వచ్చి ఆమె హృదయంలో తిష్టవేసి కూచోడమే.

ఒకరోజు ఆమె ఉదయం తలుపులు తీసిలోనికి వెళ్ళేసరికి అక్కడ నవ్వుతూ భక్తునిలా రెడ్డిగారు కూర్చుని ఉన్నాడు. ఆమె తెల్లబోయింది. ఆమెకు కోపం వచ్చింది. ఎవరైనా సరే పెద్దమనిషి అయినా ఇంటియజమాని నడగక వచ్చి కూర్చుంటారూ? పోనీ ఆ కూర్చోడం ఏ ముందర హాలులోనో అధివసిస్తే అంతకోపం రాదు. మనకు అత్యంత ఇష్టమైన మనకోసమే కేటాయింపయిన గదిలోకి వెళ్ళడమే!

“అదోయి నువ్వు చేసినపని, చౌధురాణి మొదటే నిన్ను ప్రేమించింది. ఆమె ప్రేమంటే ఆమెగారే సిగ్గుపడింది, కొంచెము నువ్వు ప్రేమికుడవు. అంత సిగ్గుపడడానికి చిన్న కుర్రవాడవా నువ్వు?” ఈలా వ్రాశాడు కోనంగి జైలు నుంచి. చౌధురాణి ఆ పేరులో ఉంది మాధుర్యం. స్టాలిన్ భార్యనాడియా, తన భార్య “చౌధు.” ప్రపంచంలో అందమైన వాళ్ళందరూ రష్యాలోనే ఉంటారు అని అనుకునేవాడు రెడ్డి కాని భారతదేశంలో సోవియటు దేశ నారీమణులకు పాఠాలు నేర్పే అందకత్తియలున్నారు. అందులో ఆంధ్రయువతులు పురుషుల హృదయాలను మాలలు మాలలుగా గుచ్చుకొనడానికైనా లెక్కచేయని అందకత్తెలు. వారందరిలో రాణీ చౌధురాణీ!

అయితే ఇండియా కమ్యూనిస్టుదేశం అయితే ఈ రాణీలు? అందాల రాణులు అప్పుడు అందాల కామ్రేడులవుతారు.