పుట:Konangi by Adavi Bapiraju.pdf/251

ఈ పుట ఆమోదించబడ్డది

రాష్ట్రనాయకులు, జిల్లానాయకులు బంధింపబడినారు. ప్రజలు లక్షలు బయలుదేరి రైళ్ళావి, పెట్టెలు తగులబెట్టినారు. పట్టాలు లాగిపారవేశారు. తంతిటపాతీగలు తెంపిపారవేశారు. రైయిలు స్టేషనులు, తాలూకాఫీసులు, కలెక్టరాఫీసులు తగులబెట్టారు.

అనేక స్థలాలలో పోలీసు కాల్పులు, ప్రజల చావులు, పోలీసులనే కొన్నిచోట్ల తగులబెట్టినారు. దిట్టమయిన జాతీయ నాయికా నాయకులు మారుమూలలకు పోయి ఉద్యమం సాగిస్తున్నారు.

కొన్నిచోట్ల బ్రిటిషురాజ్యము మాయమైపోయింది; కొన్నిజిల్లాలలో ప్రజారాజ్యాలు స్థాపించారు.

బ్రిటిషుపత్రికలు మహాత్మునీ, కాంగ్రెసునీ తీస్తున్నాయి భారతీయ పత్రికలలో ప్రభుత్వం ఇష్టంలేకుండా ఈ 1942 సత్యాగ్రహవార్తలు ప్రచురించకూడదట! అమెరికన్ పత్రికలకు వార్తలు సరిగా వెళ్ళటంలేదట బ్రిటిషువారలంటే ఇష్టంవున్న పత్రికలు ఇండియా చర్యలను నిరసిస్తున్నవి.

కమ్యూనిస్టులు కాంగ్రెసువారి చర్యలను నిరసించారు. రాయిష్ణులు కాంగ్రెసును దుమ్మెత్తిపోసినారు. పత్రికాసంపాదకులందరూ కూడా ప్రభుత్వంవారు తమ స్వాతంత్ర్యం అరికట్టడం నిరసించారు. తాము యుద్ధవిషయంలో ప్రభుత్వానికి ఎంత సహాయంచేసిందీ వివరించారు. చివరకు ప్రభుత్వంవారే రెండుమెట్లు క్రిందికి దిగినారు.

జర్మనీ నుంచీ, సైగాను జపాన్ నుంచీ రేడియోలో ఇండియాలోని వార్తలన్నీ ప్రచారం కాసాగాయి. సుభాష్ బాబుగారు బర్మా, మలయాలలో భారతీయ జాతీయసేన నిర్మించారు. ఒక సేన జర్మనీలో నిర్మించారు; భారతీయ సేనలు జపానువారికి పట్టుబడినవి. అవి జాతీయసేనలో చాలా వరకూ చేరినవి.

మలయా, బర్మాలలో భారత జాతీయప్రభుత్వం నెలకొల్పినారు. సుభాష్ బాబు దానికి నేతాజీ అయినాడు. అక్కడే జాతీయబ్యాంకు నిర్మాణం చేయగా కోటిరూపాయలు వసూలయినాయి.

భారతదేశంలోనే రహస్యంగా రేడియో స్టేషనులు బయలుదేరినవట. వాటి పలుకులు కూడా ఉద్యమాన్ని హుషారు చేయడం సాగించాయి.

చాలామంది పత్రికానేతలు ప్రభుత్వంవారు విధించిన నిషేధం అన్యాయమని తమ ప్రచురణలు ఆపి వేసినారు.

రైళ్ళు సరిగా వెళ్ళటంలేదు. దేశం అల్లకల్లోలమైపోయింది.

లోకం అంతా ఇంత తల్లక్రిందులౌతుందని కోనంగి కలలో అనుకోలేదు. అన్ని జాతీయ పత్రికలతోపాటు కోనంగి తన పత్రికా కట్టివేశాడు. ప్రభుత్వంవారు పత్రికలు చేసిన గడబిడవల్ల చాలావరకు నిషేధాలు తీసివేశారు. ప్రభుత్వానికి పత్రికా సలహాసంఘం పెట్టారు. అప్పుడు తక్కిన పత్రికతోపాటు కోనంగి నవజ్యోతిని మళ్ళీ ప్రకటించ సాగించాడు.

నవజ్యోతి పత్రికాసంస్థ సామ్యజాతీయవాద సమ్మిళిత పత్రిక. పత్రిక అచ్చుపని వారికి. యంత్రపనివారికి, గుమాస్తాలకు, అచ్చుపత్రాలు సరిదిద్దువారికి అందరకూ ఒకటే జీతం, డెబ్బదిఅయిదు రూపాయలు. పనివాళ్ళ ముఖ్యునకూ, ఉపసంపాదకులకూ నూరురూపాయలు జీతం. సహాయసంపాదకునకూ ప్రకటన పెద్దకూ, ఆఫీసు మేనేజరుకూ, పత్రిక సరఫరా పెద్దకూ నూటయాభైరూపాయల చొప్పున జీతం.