“యేముంది, మా బావ ముస్లింలీగులో చేరితేనేగాని నేను అతణ్ణి పెళ్ళిచేసుకోదలచు కోలేదు.”
“ఆయన చేరడనుకో!”
“చేరకపోతే చేసుకోను. అది నిశ్చయం.”
“ఇంకొకరిని చేసుకుంటావా?”
“అసలు పెళ్ళే చేసుకోను.”
“ముసలిదాని వైనంతవరకూ అల్లా ఉండిపోతావా?”
“ఆ!"
“పూర్వకాలంలో క్రైస్తవ మిషనరీలు క్రొత్తగా వచ్చినప్పుడు తెల్లగా, బొల్లిగా ఉన్న వాళ్ళమ్మాయిలు కూడా వచ్చేవారు. ఆ అమ్మాయిలను చూపించి, చదువుకునే యువకులను ఊరించి, వాళ్ళ క్రైస్తవమతం పుచ్చుకుంటే, ఆ తెల్లపిల్లలను చేసుకోవడానికి తమ అభ్యంతరం లేదనే వారట ఆ మిషనరీలు. ఆ పిల్లల కాసించి ఎంతమందో మతం పుచ్చుకొనే వారట.”
“నీ కథకూ నా వివాహానికీ సంబంధం ఏమిటే?”
7
“అనంతలక్ష్మి మెహరున్నీసా మాట వింటూనే తన భర్త జ్ఞాపకము వచ్చి, కళ్ళనీళ్ళతో దీనముఖంతో తలవాల్చుకుంది. మెహర్ అనంతలక్ష్మిని కౌగలించుకొని హృదయానికి గట్టిగా అదుముకొని, “అనంత్, నీకు ఈ పామరత్వమేమిటే? మన చదువంతా గంగలో కలిసిపోయిందన్న మాటే? దేశంకోసం అని ఆలోచించి వెళ్ళకపోయినా, నీ భర్త జయిలుకు వెళ్ళడం దేశంకోసమేకదూ! వీరనారివై, పదిమందిలో అతిసంతోషంతో తిరక్క ఏమిటీ వాజమ్మతనం?” అని గదిమింది.
“ఈ ఉత్తరాలు చదువు” అని అనంతలక్ష్మి చెట్టియారూ, ఆ సినీమా తారలూ వ్రాసిన ఉత్తరాలు మెహరున్నీసా చేతిలో పెట్టింది.
అందులో తెనుగు ఉత్తరాలు రెండూ చదువుకొంది మెహర్. ఆమె గులాబీపూవు మోము ఎఱ్ఱగా జేవురించింది.
“ఈ ఉత్తరాలేమిటి? ఏ రాక్షస స్త్రీలు ఈ ఉత్తరాలు వ్రాయగలిగారు?” అని బాలిక ప్రశ్నించింది.
“ఈ అరవ ఉత్తరం చదివి అర్థం చెబుతాను విను” అని అనంతలక్ష్మి తలయెత్తి కన్నీరు తుడుచుకొని, ఆ ఉత్తరాలు చదువుతూ మెహరునకు అర్థం చెప్పింది. ఇంక మెహర్ పట్టలేకపోయింది. క్రోధమూర్చిత వ్యాఘిపోలిక ఆమె రాజుతూ “ఈ రోజుల్లో చదువుకొనే బాలికలను, ఈ పురుష వెధవ పందికొడుకులు బ్రతకనీయ దలచుకోలేదు. వెనక నాకు రెండు మూడు ప్రేమ ఉత్తరాలు, తిరువలిక్కేళిలో అక్బర్సాహెబ్ వీధిలో మా బంగాళా ప్రక్కను చదువుకొనే కుట్టకుంకలు వ్రాశారు. నాకు వచ్చిన కోపం మిన్నుముట్టింది. అయినా ఊరకున్నాను! వాళ్ళు కారులో నేను వెళ్ళి కూర్చోబోయే ముందు పొంచివుండి చూసేవారు” అని అన్నది.
“ఆ ఉత్తరాలు ఏంచేశావు?”