“నీకు వీలుగా ఉంది నియమం!”
“నాకు వీలుగా ఉందోలేదో అదికాదు విషయం. నేను వారిని ఒక్క నిముషం వదలి వుండలేను. స్నేహం తప్ప యింకో సంబంధం లేకపోతే వారితో తిరుగుతూ యితర అనుమానాలకు గురికాకుండా ఎట్లా వుంటాను? నువ్వు ఏనాడు తెచ్చిపెట్టావో ఆ సెట్టియారును, ఆ రాక్షసుడు నెమ్మది నెమ్మదిగా మా కాలేజీలో నన్ను గురించి వినరాని అపవాదులన్నీ వెదజల్లు తున్నాడు.”
“ఇదా వెర్రితల్లీ నీ భయమూ? మన్నారుగుళ్ళో మన అయ్యవార్లం గారిని ముహూర్తం పెట్టమందాం. నేను కోనంగిరావుతో చెప్పి అన్నీ సిద్ధం చేస్తాను.”
ఆ మాటలు వింటూనే అనంతలక్ష్మి తల్లిని కౌగిలించుకొని తల్లి బుగ్గను ముద్దు పెట్టుకొని నాట్యంచేస్తూ తాను తన కాలేజీలో ఆడిన నాటకంలోని ఒకపాట:
లోక మెంత తీయనైంది
శోక మెంత హీనమైంది
మూక బాధ లేల ప్రజకు
ఆక లేల చీకటేల?
పూవులుండే తావులుండే
పూలనాను మధుపముండే
తావి పన్నీరుజల్లు
తావిరంగు ఉదయముంది.
రంగు రంగు భూమిపైన
రమ్యరూప దర్శనమ్ము
దారి పొడుగునా వెలుంగు
తలిరుటాకు తరళమూర్తి.
ఏదో యీ ఉదయంలో
హృదయంలో రాగమాల
ఆనందం తాళాలై
అడుగువేసె బ్రదుకుదారి”
అని పాడుకుంటూ తన్నతిమనోహరంగా అలంకరించుకుంది. నాటకమైన నాల్గవరోజది. కోనంగి రావడం తరువాయి. అతన్ని పొదువు కోవడమే! అతను కదలడానికి వీల్లేదు. అది క్రిష్టమస్ సెలవరోజులు గనుక అనంతలక్ష్మి ఇంటి దగ్గరే ఉండడం, కోనంగి. సినిమాకు తీసుకు వెళ్ళాలి. కోనంగి బీచికి తీసుకొని వెళ్ళాలి. కోనంగి ఎక్కడికైనా తీసుకు పోవాలి. ఎన్నూరో, కంచో, మహాబలిపురమో, తిరుక్కాళికుందరమో (పక్షితీర్థం) కోనంగి వచ్చి శిల్ప సందర్శనమూ, క్షేత్ర ప్రదర్శనమూ చేయించాలి. తిరువన్నామలై వెళ్ళి రమణ మహర్షిని దర్శింపించాలి.
వాళ్ళకు సెలవలు సంక్రాంతి చివరకు. ఈలోగా చెన్నపట్నంలో గానసభలన్నింటికీ వెళ్ళారు. ఆమె తీగలా కోనంగిని ఆల్లుకుపోయింది.
కోనంగి ఆమె ప్రేమావేశం చూచి ఆశ్చర్యం పొందాడు. ఇంతవరకు అనంతలక్ష్మికి తన యందు గాఢప్రేమ లేదని ఎప్పుడూ అనుకోలేదు. కాని ఈ విధంగా తన్ను వివాహం కాకుండానే ఇంత చుట్టివేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.