పుట:Konangi by Adavi Bapiraju.pdf/132

ఈ పుట ఆమోదించబడ్డది

కోనంగి తలవంచుకొని, “అలాగేనండి! ఆమె నాకు భార్యకాక, నేను జీవంలేని కఱ్ఱనే అయిపోతాను. పెద్దలతో ఆలోచించి మీరు ఎప్పుడు ముహూర్తం పెట్టినాసరే!” అన్నాడు.

9

జయలక్ష్మి కోనంగి కడకు కళ్ళనీళ్ళు తిరుగుతుండగా వచ్చి అతని చెంపలంటి తన చెంపలకు విరిచికొని లోనకు గబగబ వెళ్ళిపోయి తన పూజామందిరము కడ ఉన్న భర్త చిత్రానికి సాష్టాంగపడి. స్వామీ, ఈ అబ్బాయి అమ్మిణికి తగిన భర్తెనా?” అని వేడుతూ అడిగింది. ఆమెకు ఆ బొమ్మ చిరునవ్వు నవ్వినట్లయింది.

డాక్టరు ఇంటిదగ్గర ఉండే రోజుల్లో కోనంగికి డాక్టరు స్నేహితులు జనాబ్ మొహమ్మద్ మొహిద్దీన్, బార్-ఎట్-లా గారితోనూ, కాట్రేడ్ కాంతారావు, ఎం.ఎల్.సి. ఆంధ్ర కమ్యూనిస్టుపార్టీ అధ్యక్షునితోనూ, రిక్షావారి సంఘం ఉపాధ్యక్షుడు, రిక్షాలాగే వారిలో ప్రథమ బహుమానమందిన వారునూ అయిన వరదరాజులతోనూ, అఖిలాంధ్ర రైతుసంఘ కార్యదర్శి కృష్ణదేవరాయచౌదరితోనూ మంచి స్నేహం కుదిరింది.

కోనంగి మొదటి నుంచీ కాంగ్రెసు వారితో స్నేహం చేస్తూనే ఉన్నాడు. ఆంధ్ర కాంగ్రెసు కార్యాలయంలో మూర్తి అనే కాంగ్రెసు సేవకునికీ, కోనంగికీ ఎంతో స్నేహం అయింది. డాక్టరు రెడ్డి కాంగ్రెసు వారికీ వైద్యుడే! అక్కడే రియాసత్ ఆలీ అనే కాంగ్రెసు ముస్లిం కూడా కోనంగికి స్నేహితులయ్యారు. వీరే గాకుండా వీనస్ వస్త్రయంత్రాలయం కూలీల నాయకుడు పాములపాటి జేము అనే క్రైస్తవునితో స్నేహం గాఢమైంది.

స్నేహితులందరితో ఎప్పుడూ కోనంగి వాదిస్తూ ఉండేవాడు. ఎవరు ఏ విషయంమీద వాదిస్తే వారికి ఎదిరిగా వాదించడం అంటే కోనంగికి మహాసరదా. ఆ వాదనైనా తర్కరూపంగా ఉంటుందా? హేళన, హాస్యము, అవహేళన, అపహాస్యమూనూ! అవతలివాడు అతిపూటుగా మాట్లాడుతూ ఉంటే ఆ వాదనంతా ఇనుపగుండు అనుకున్నవాణ్ణి దూదిపింజలా ఎత్తి అవతల పారవేస్తాడు. కోనంగిని బాగా అర్థం చేసుకున్నవాళ్ళు నవ్వేస్తారు. తక్కిన వాళ్ళకి కోపాలు కూడా వస్తూ ఉంటాయి.

ఎంత మనిషినైనా కోనంగి ఏడ్పించగలడుగాని తనను మాత్రం చెక్కు చెదర్పలేడు. ఇంతమంది స్నేహితులున్నా తన హృదయం సంపూర్ణంగా చెప్పే స్నేహితులు కోనంగికి ఇద్దరే! ఒకడు డాక్టరు రంగనాయకులు రెడ్డి, రెండోవాడు రియాసత్ ఆలీనీ.

ఆ డాక్టరు రెడ్డిగారి ఇంటా, ఆంధ్రమహాసభా మందిరంలోనూ కోనంగి అనేకమందిని కలుసుకుంటూ ఉండేవాడు.

ఆంధ్రమహాసభ వాతావరణంలో మూడే ముఖ్యవిషయాలు. ఒకటి పేకాట, రెండు నాటకాలు, మూడు బిల్లార్సు, టెన్నిస్, పింగ్ పాంగు మొదలయిన ఆటలూ, వాని పందేలూ.

మదరాసు ఆంధ్రులు పేక ఆడడం మొదలు పెడితే ఆట వరసగా రోజులు రోజులు ఆడగలరు. హెూటల్సునుంచి సెట్టు గిన్నెలలో భోజనాలు వస్తాయి. మహాసభ భవనంలో మంచి కాఫీపౌూటలుంది. సిగరెట్లు, బీడి, వెత్తలపాకు దుకాణమూ ఉంది. మూడుముక్కల ఆట, అయిదు ముక్కల ఆట, బ్రిడ్జి ఆంధ్రులకు మా ఇష్టం. కొందరు జట్టులవారు రూపాయలు మేజులుపెట్టి ఆడ్డారు. వేలకొలది రూపాయలు మారుతూ వుంటాయి. ఆంధ్ర మహాసభకు ఒక్క పేక అమ్మకంవల్ల అద్దె డబ్బులు రెండువందలు వచ్చేస్తాయట.