ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిండిప్రోలు లక్ష్మణకవి.

441

సీ. చింతలూరికి మిరాసీదారుఁ డగుజగ్గ, రాజుకుఁ బుత్రు లౌరసులు లేమిఁ
    దనకును బిన్న యౌతండ్రి నందను నను,బాపిరాట్సుతు దత్తభావుఁ జేసి
    కొనుటచే నిదివఱకును తద్గృహక్షేత్ర, కర్తనై యుండుట కలకటరుక
    చేరీలలెక్కలఁ జిత్తగించినఁ జాలు, నేది నేనెఱుఁగనియిట్టిపనికి

తే. బాపిరాట్సుతుఁ డని నేను పల్కినట్లు, వాది పన్నినకపటభావమె నిజ మని
    పట్టి దత్తుఁడు గాఁ డంచుఁ బండితుండు, చేసె తీరు పుభయభ్రష్టుఁ జేసె నన్ను.

ఉ. అత్తినధర్మశాస్త్రవిధి కడ్డని చూడక కల్కటర్లసం
    సత్తులలెక్క లారయ విచారము సేయక రాజ్య మేలుభూ
    భృత్తు సభాస్థపత్త్రలిపిరీతిఁ దలంపక విత్తవాంఛచే
    దత్తు నదత్తు డం చనునధార్మికపండితు డుంట యొప్పునే.

ఉ. పస్పసఁ జేసె నాబ్రతుకు పండితుఁ డిం కెటు నిల్తు నందు నే
    నిస్పృహవృత్తి నుండఁగను నిన్నటిరేఁ గలలోనఁ గోర్టువా
    రిస్పిసి యాలు పట్టి రిఁక నేర్పడ న్యాయము తీర్తు మంచు ధై
    ర్యాస్పదసూక్తిఁ బల్కినటు లైన మిముం బొడగానవచ్చితిన్.

అని చదివిన విని బ్రౌనుదొర సంతసించి మంగన్న దాఖలుచేసిన అపీలు స్పెషల్ అప్పీలుగా నంగీకరించె ననియు నద్దానిం దెలిసికొని మంగన్న విరోధులు పండితునితీర్పు భంగ మగునేమో యని భయపడి మంగన్నతో సమాధానము పడి మంగన్న మరల బ్రౌనుదొరకడఁ జెప్పుకొన నక్కఱలేకుండ సంతోష పెట్టి రని కలదు.

ల. కవి విశేషములు పెక్కులు గలవు. తెనాలి రామకృష్ణునివాక్కులయం దెట్టిచమత్కృతి కలదో ల. కవి వాక్కులయం దట్టిచమత్కృతి కలదనియును, నీతఁడును సమయస్ఫురణము కలవాఁ డనియు, జంగము బసవయ్య మొద లగువారిపై ననేకచాటుధారపద్యంబుల రచించె ననియు వాడుక గలదు. అట్టిపద్యము లసభ్యములుగా నుండుటచేత వానిని వివరింపలేదు.

ఆంధ్రద్వ్యర్థికావ్యకవులచరిత్రము ముగిసెను.